Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెల్లబంగారంపై నీలినీడలు

తెల్లబంగారంపై నీలినీడలు

- Advertisement -

– ఎమ్మెస్పీ స్థానంలో పీడీపీఎస్‌ విధానం
– కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి పత్తి కొనుగోళ్లు
– పత్తి మద్దతు ధరల నుంచి దూరం జరుగుతున్న కేంద్రం
– మధ్యప్రదేశ్‌లో విఫలమైన పీడీపీ స్కీం
– ఆదిలాబాద్‌ జిల్లాలో దాన్నే పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు
కేంద్రం తెల్లబంగారాన్ని (పత్తి) మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు కొనబోదు. రైతులు ఆ పంటను బహిరంగ మార్కెట్లో అమ్మేసుకోవాలి. సర్కారు ప్రకటించిన మద్దతు ధరకంటే తక్కువ రేటు వస్తే, ఆ ధర వ్యత్యాసాన్ని మాత్రమే ప్రైస్‌ డెఫిషియన్సీ పేమెంట్‌ స్కీం (పీడీపీఎస్‌- ధర వ్యత్యాస చెల్లింపు పథకం) ద్వారా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. గతంలో ఈ స్కీంను మధ్యప్రదేశ్‌లో అమల్లోకి తెస్తే, అక్కడ ఫెయిల్‌ అయ్యింది. దాన్నే ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమల్లోకి తెస్తున్నారు. రైతుల్ని కొల్లగొట్టి, దళారులకు రాజభోజ్యం కల్పించే ఈ స్కీంలో అన్నీ లోపాలే. రైతు వ్యతిరేక నల్లచట్టాల్ని కార్పొరేట్ల కోసం మరో రూపంలో అమల్లోకి తెచ్చేందుకు మోడీ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో భాగం!!
గుడిగ రఘు

తెల్లబంగారం (పత్తి) కొనుగోలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పంట అమ్ముకునే రైతు హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. కొన్ని దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తిని కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు కొనుగోలు చేస్తున్నది. ఈ పద్దతికి మోడీ సర్కారు స్వస్తి పలకాలని యోచిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పీడీపీఎస్‌) ద్వారా పత్తి కొనుగోళ్ల నుంచే దూరంగా జరగాలని భావిస్తున్నది. ఈ స్కీంలో రైతు తన పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అక్కడ మద్దతు ధర కంటే రైతుకు తక్కువ ధర వస్తే, మిగిలిన డబ్బును కేంద్రం నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తామంటున్నది. పత్తి కొనుగోళ్ల బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుని ఆ బాధ్యతను కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టబోతున్నది.
ఆదిలాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌
భవంతర్‌ భుగ్‌తాన్‌ యోజనం పేరిట మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ హయాంలో అమలు చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు దాన్నే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ఏడాది పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయనుంది. ఒక చోట విఫలమైన ప్రయోగాన్ని, కార్పొరేట్‌ కంపెనీల ఒత్తిడి మేరకు, రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. దీంతో ఎవరికి లాభమో, ఎవరికి నష్టమో తేల్చాలని అధికారుల్ని ఆదేశించారు.
కార్పొరేట్‌ కంపెనీల కోసం కొత్త దారి
ఇప్పటికే అమలులో ఉన్న ఎమ్మెస్పీ స్థానంలో పీడీపీఎస్‌ విధానాన్ని తేవడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజేప్పేందుకు కేంద్రం కొత్త దారులను అన్వేషిస్తున్నది. అందులో భాగంగానే పత్తి కొనుగోళ్ల నుంచి వైదొలిగి దళారులకు, జిన్నింగ్‌ మిల్లులకు అప్పగించి రైతులను నట్టేట ముంచే ప్రయోగం చేయబోతున్నది. రైతాంగ ఉద్యమ ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్రం…మరో రూపంలో వాటిని అమలు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. నూతన జాతీయ మార్కెట్‌ చట్టాన్ని తీసుకొస్తున్నది. పత్తి రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించినట్టు చెబుతున్నది. కానీ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో రైతులు ప్రతి ఏటా మోస పోతూనే ఉన్నారు. పత్తి పంట చేతికి రాక ముందే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మధ్యదళారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై పత్తి కొనుగోళ్ళు ఆలస్యం చేస్తున్నారు. పంట చేతికొచ్చాక రైతు దాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. చేసిన అప్పులు కండ్ల ముందు కనిపిస్తుంటే, సకాలంలో సీసీఐ పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులపై ఒత్తిడి పెరిగి, విధిలేక మధ్యదళారులను ఆశ్రయించి, తక్కువ ధరకు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రైతు ఎక్కడైనా పత్తిని అమ్ముకోవచ్చంటే, కార్పొరేట్‌ రాబందులు ఏలా కాచుకొని కూర్చుంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

పీడీపీఎస్‌ ఎలా?
పీడీపీఎస్‌ను అమలు చేయడం అచరణలో ఎలా సాధ్యమనేది ప్రశ్న. ప్రయివేటులో పత్తి కొన్న వ్యా పారి రైతుకు రసీదు ఇస్తారా? దాన్ని కేంద్రం ప్రతిపాదికగా తీసుకుంటుందా? దాన్ని అధికారులు ఏ విధంగా లెక్కిస్తారు. రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు పత్తి పండిస్తారు. 21 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుంది. అందులో ఇప్పుడు సీసీఐ సగం పత్తిని కూడా కొనడం లేదు. ఎక్కువగా దళారుల దగ్గరే కొని ఎగుమతులు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అంతమంది నష్టపోతే కేంద్రం ఇవ్వగలదా? ఆ భరోసా కేంద్రం ఇస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవని రైతు సంఘాలు చెబుతున్నాయి. ధరల వ్యత్యాసాన్ని నిర్ధారించడంలో లోపాలు, వ్యత్యాసం ఉన్న ధర చెల్లించడంలో ఆలస్యం, మార్కెట్‌ ధరల్లో తేడాలు, దళారులతో అధికారులు కుమ్మక్కు కావడం వంటి అనేక కారణాలతో పీడీపీఎస్‌ విఫలమైందని చెప్తున్నారు.

సరైన పద్ధతి కాదు
సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న మన దేశంలో పీడీపీఎస్‌ పని చేయదు. తక్కువ మంది రైతులు ఉన్న అమెరికాలో అది పని చేస్తుంది. అంతేకాకుండా అక్కడ ఆన్‌లైన్‌ పేమెంట్లు జరుగుతాయి. కాబట్టి అక్కడ అమలవుతున్నది. మన దేశంలో మార్కెట్లను ప్రయివేటీ కరించేందుకు ఇదో సాకు. పత్తి కొను గోలు నుంచి ప్రభుత్వం వైదొలిగితే వ్యాపారులదే రాజ్యం. వారే నేరుగా పత్తిని విదేశాలకు ఎగుమతి చేసి, వేల కోట్లు సంపాదిస్తారు. కష్టపడిన రైతులకు పెట్టుబడి కూడా మిగలదు.
– దొంతి నర్సింహరెడ్డి, వ్యవసాయ విధాన విశ్లేషకులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -