నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షునిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆదేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాస్ వార్నింగ్ ఇచ్చారు.‘ట్రంప్ నిజంగా మాతో అణు ఒప్పందాన్ని కోరుకుంటుంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మర్యాదగా సంబోధించాలి. ఖమేనీ పట్ల అగౌరవకరమైన, ఆమోదయోగ్యం కాని స్వరాన్ని పక్కన పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇదే సందర్భంగా ఇజ్రాయెల్పై కూడా అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దాడులతో అతలాకుతలమైన ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అమెరికా వద్దకు పరిగెత్తడం తప్ప వేరే మార్గం లేదంటూ వ్యాఖ్యానించారు. బెదిరింపులు, దాడులకు భయపడమని ప్రపంచానికి చాటి చెప్పిన శక్తివంతమైన ఇరానియన్ ప్రజలు ఎవరి దగ్గరి నుంచి సానుభూతి, ప్రాణ భిక్ష కోరుకోరని పేర్కొన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలను తానే కాపాడానని, అయినా అతడు కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్ వ్యాఖ్యనించారు. అంతేకాకుండా ఆయనను చంపే ఉద్దేశ్యం ఇప్పుడు లేదని, కొన్ని రోజులకు వాయిదా వేశామని అధిక ప్రసంగాలు చేశారు. ఇజ్రాయిల్ కూడా శుక్రవారం అనుచిత వ్యాఖ్యలు చేసింది. యుద్ధం సమయంలో ఇరాన్ అధ్యక్షుని హతం చేయాలని ప్లాన్ వేశామని, కానీ ఖమేని ఆచూకీ తమకు లభించలేదని పేర్కొంది.