Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోడీ ఏమిచ్చారు?

మోడీ ఏమిచ్చారు?

- Advertisement -

– మూసీకి ఎందుకు నిధులివ్వలేదో కిషన్‌రెడ్డి చెప్పాలి
– నగరానికి వస్తున్న అమిత్‌ షాను కలుస్తాం
– సిటీకి అవతల డీజిల్‌ బస్సులు.. లోపల 3వేల ఎలక్ట్రిక్‌ బస్సులు
– 2029లో నాలుగు నియోజకవర్గాలుగా శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలో పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
– న్యూయార్క్‌, సింగపూర్‌తోనే హైదరాబాద్‌ పోటీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

గుజరాత్‌కు సబర్మతి, ఢిల్లీకి యమున, ఉత్తరప్రదేశ్‌కు గంగాను ఇచ్చిన ప్రధాని మోడీ హైదరాబాద్‌కు ఏమిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌కు కేంద్రం ఎందుకు నిధులివ్వడం లేదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌కు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయితో పోటీ కాదని న్యూయర్క్‌, టోక్యో, సింగపూర్‌లతో పోటీ అని తెలిపారు. డిసెంబర్‌ 9లోపు తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. రాజకీయ ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని క్షమించబోమన్నారు. మూడు లేయర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలని అనుకున్నామనీ, వంద రోజుల్లో కోర్‌ అర్బన్‌ రీజియన్‌కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతాయని తెలిపారు. స్ట్రాటజిక్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద రూ.182.72 కోట్లతో రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు వరకు 1.2 కిలోమీటర్ల పొడవు, 24మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఆరు లైన్ల ఫ్లైఓవర్‌ను (పీజేఆర్‌ ఫ్లైఓవర్‌) శనివారం సీఎం ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే వందేండ్ల నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రోడ్ల వెడల్పు, అండర్‌ పాస్‌లు, ప్లైఓవర్లు నిర్మించబోతున్నామని తెలిపారు. డీజిల్‌ బస్సులతో హైదరాబాద్‌లో కాలుష్యం పెరుగుతోందనీ, వాటిని జిల్లాలకు తరలించామన్నారు. నగరంలోకి 3వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకువస్తున్నట్టు చెప్పారు. ఆటోల కొనుగోలు పైనా నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్‌, సీఎన్‌జీ ఆటోలకు అనుమతి ఇస్తున్నామన్నారు. పీజేఆర్‌ ఇల్లు జనతా గ్యారేజ్‌లా ఉండేదని చెప్పారు. పీజేఆర్‌ పోరాటంతోనే నగరానికి కృష్ణాజలాలు వచ్చాయని అన్నారు. హైటెక్‌ సిటీ మహారాష్ట్రకు తరలిపోకుండా పీజేఆర్‌ పోరాడినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో 65శాతం ఆదాయం హైదరాబాద్‌ నగరం నుంచే వస్తోందన్నారు. నగర అభివృద్ధికి కొందరు అవాంతరాలు, అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌ 2047 ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు ప్రకటించారు. గచ్చిబౌలి భూముల్లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తే.. అభివృద్ధి నిరోధకులు అడ్డుకున్నారని ఆరోపించారు. గచ్చిబౌలి భూములపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో నాలాల కబ్జాల కారణంగా వర్షపు నీరు రోడ్లపైకి వస్తోందన్నారు. హైడ్రాతో ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రభుత్వం తొలగించిందని గుర్తు చేశారు. హీరో నాగార్జున స్వయంగా ఎన్‌ కన్వెన్షన్‌కు చెందిన రెండెకరాలు ప్రభుత్వానికి అప్పగించి సహకరించారన్నారు.

30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ
30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచం అంతా భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వైపు చూస్తోందని అన్నారు. మన్మోహన్‌సింగ్‌, జైపాల్‌రెడ్డితో హైదరాబాద్‌కు మెట్రో, పీవీ నరసింహారావుతో ఐటీ వచ్చిందని తెలిపారు. ప్రధాని మోడీతో హైదరాబాద్‌ నగరానికి ఏమీ రాలేదన్నారు. బెంగళూరు, చెన్నై, ఏపీకి మెట్రో రైలు.. గుజరాత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి వస్తున్న అమిత్‌ షాను కలిసి మెట్రోకు, త్రిబుల్‌ ఆర్‌కు, మూసీకి అనుమతులు ఇవ్వాలని కోరుతామని తెలిపారు. మెట్రోలో తెలంగాణ తొమ్మిదో స్థానానికి దిగజారిందనీ, ఇది కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎవరు కుట్రలు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందనీ, శేరిలింగంపల్లి నాలుగు నియోజకవర్గాలుగా అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
పేదలకు అండగా నిలిచిన పీజేఆర్‌ విగ్రహం ఏర్పాటు కోసం సరైన స్థలాన్ని గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శాసనమండలి చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -