– ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాద మూకల అరాచకానికి తలొగ్గి విద్యార్థులకు శాస్త్రీయ విద్యను బోధించిన యాలాల మండలం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల బయోసైన్స్ టీచర్ విధులనుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని ఆవాజ్ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఈఓ ఇలాంటి చర్య తీసుకోవటం తగదని పేర్కొన్నారు. తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా జడ్పీహెచ్ఎస్ యాలాల బాలికల పాఠశాలలో పనిచేస్తున్న బయోసైన్స్ పాఠ్యాంశ బోధనలో భాగంగా ప్రత్యక్షంగా పిల్లలకు అవగాహన కల్పించటం కోసం చనిపోయిన జంతువు మెదడును ప్రదర్శిస్తూ పాఠాన్ని బోధించారని తెలిపారు. పిల్లలకు అవగాహన కల్పించడం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని అభినందించాల్సింది పోయి మతోన్మాద మూకల దుష్ప్రచారానికి తలొగ్గి ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయించడమేంటని ప్రశ్నించారు. పాఠ్యాంశబోధనతోగాని, పాఠశాలతోగాని ఎలాంటి సంబంధం లేని మతోన్మాద మూకలు వచ్చి ఆందోళన చేసి, పాఠశాల వాతావరణం చెడగొడుతుంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిన డీఈఓ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయడం శోచనీయమని తెలిపారు. ఇలాంటి చర్యలు మతోన్మాద మూకలకు మరింత బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. గతంలో నిజామాబాద్లో, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మతోన్మాదులు అదే రకమైన దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. శాస్త్రీయ భావజాలంతో పనిచేసే టీచర్లపై దాడులు చేస్తున్నవారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్పై విధించిన అక్రమ సస్పెన్షన్ రద్దు చేసి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి అబద్ధాలు ప్రచారం చేసి పాఠశాలపైకి మతోన్మాద మూకలను ఎగదోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బయోసైన్స్ టీచర్ని సస్పెండ్ చేయడం అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES