పట్టించుకోని అధికారులు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రం నుంచి హనుమాపురం వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డిఓ ఆఫీస్ పక్కన ఆర్ఓబి బ్రిడ్జి , ఆర్కే హాస్పిటల్ ముందట గుంతలు ఉండడంతో వాహనదారులు ఆ మార్గం గుండా ప్రయాణించాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలావరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రోడ్డును సందర్శించి, పనులు ప్రారంభిస్తానని చెప్పినా, పనులు ప్రారంభం కాలేకపోవడంతో అధికారులు స్పందించాలని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు , స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి: ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు
విజయవాడ జాతీయ రహదారి నుంచి చిట్యాల మీదుగా భువనగిరి జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేటకి వెళ్లడానికి నేషనల్ పర్మిట్ గల లారీలు ఎక్కువగా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. చిన్న గుంత పడితే వాహనాలు వెళ్లడంతో పెద్దపెద్ద గుంతలుగా మారి వర్షాలు పడినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్పందించాలని కోరారు.