నవతెలంగాణ-హైదరాబాద్ : బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ టార్గెట్గా పతంజలి కంపెనీ చేస్తున్న వ్యంగంతో కూడిన ప్రకటనలను తక్షణం నిలిపేయాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. పతంజలి సంస్థ తమ ఉత్పత్తుల్లో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఒకదాని గురించి అవమానకరమైన ప్రకటనలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ డాబర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుర్వేద, శాస్త్రీయ గ్రంథాల ఆధారంగా చ్యవన్ప్రాష్ను తయారు చేసిన ఏకైక సంస్థ తమదేనని, డాబర్ వంటి ఇతర బ్రాండ్లకు ప్రామాణికమైన జ్ఞానం లేదని, అవెలా తయారు చేయగలవని యాడ్స్ను పతంజలి రూపొందించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పతంజలి తమ ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణం వాటిని ఆపేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. తాము మార్గదర్శకాలను అనుసరించే ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, పతంజలి రూపొందించిన యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వివరించింది. అంతేకాకుండా డాబర్ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన కారణంగా రూ. 2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని పిటిషన్లో పేర్కొంది. డాబర్ చ్యవన్ప్రాష్లో 40 రకాల మూలికలు ఉండటం సర్వసాధారణమని పతంజలి ప్రచారం చేస్తోంది. పతంజలి ఉత్పత్తులో 51 మూలికలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా పతజలి ఉత్పత్తిలో మెర్క్యూరీ వాడారని, దానివల్ల పిల్లలకు హాని ఉంటుందని డాబర్ పిటిషన్లో వివరించింది. దీనిపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పతంజలి యాడ్స్ను తక్షణం నిలిపేయాలని, తదుపరి విచారణ జూలై 14కి వాయిదా వేసింది.
బాబా రాందేవ్ పతంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES