నవతెలంగాణ-హైదరాబాద్ : అడవుల్లో ఉండే సింహాలు రోడ్లపైకి వస్తే.. ఇంకేమైనా ఉందా? ఇక ప్రాణాలు పోయినట్టే. ఏకంగా ఒక సింహం వీధులోకి వచ్చేసి నానా బీభత్సం సృష్టించింది. కనిపించిన జనాలపైన పంజా విసిరింది. ఈ షాకింగ్ ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది.
పాకిస్థాన్లోని లాహోర్లో రద్దీగా ఉండే వీధిలోకి ఇంట్లో నుంచి తప్పించుకుని వచ్చిన ఒక సింహం బీభత్సం సృష్టించింది. గోడ మీద నుంచి దూకి.. మార్కెట్కు వెళ్తున్న ఒక మహిళపై అమాంతంగా దాడి చేసింది. ఆమెను కింద పడేసి దాడి చేసింది. అనంతరం ఇద్దరు చిన్నారులపైన ఎటాక్ చేసింది. ఐదు, ఏడు సంవత్సరాల పిల్లలపై దాడి చేసి.. వారి చేతులు, ముఖాలను గోళ్లతో గీసేసింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. గాయపడ్డ మహిళను, ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. 11 నెలల వయసున్న మగ సింహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారికి ఎలాంటి అపాయం లేదని చెప్పారు. ఇక సింహం వీధిలో దాడి చేస్తుంటే.. దాని యజమానులు సంతోషించారని బాధిత పిల్లల తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు
ఇక నిందితులు సింహాన్ని తీసుకుని అక్కడ నుంచి పారిపోయారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు లాహోర్లోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ తెలిపారు. జంతువు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించిదని చెప్పారు.
దేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ అయిన పంజాబ్లో అన్యదేశ జంతువులను.. ముఖ్యంగా సింహాలను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం ప్రత్యేక హక్కుగా.. అధికార చిహ్నంగా ఉంటుంది. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలా తీసుకున్న వారు ఇంట్లో ప్రత్యేకంగా సింహాలను పెంచుకోవచ్చు. ఇక నివాసాల్లో కాకుండా పొలాల్లో పెంచుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం పెంపకందారులు భారీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పొలాలు కనీసం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి.