నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. క్రికెట్ పిచ్పై తనదైన ముద్ర వేసిన రైనా, ఇప్పుడు నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆయన ఓ తమిళ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి లోగాన్ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ నైట్ స్టోరీస్ (డీకేఎస్) పతాకంపై శ్రవణకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా రైనాకు తమిళనాడుతో బలమైన అనుబంధం ఉంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి క్రికెటర్ శివమ్ దూబే హాజరై నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుతం తన కుటుంబంతో నెదర్లాండ్స్లో ఉన్న రైనా, ఈ ఈవెంట్లో వర్చువల్గా పాల్గొని తన సంతోషాన్ని పంచుకున్నాడు.