నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం విషమించడంతో, బోడుప్పల్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కష్టకాలంలో యువ హీరో విష్వక్ సేన్ స్పందించి, ఆయన కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.
గత కొన్నేళ్లుగా ఫిష్ వెంకట్ డయాలసిస్పైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రస్తుతం ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని ఆయన కుమార్తె స్రవంతి తెలిపారు. వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారని, అయితే దాత కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ చికిత్సకు అయ్యే ఖర్చు తమకు భారంగా మారిందని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ప్రభాస్ సాయం చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వెంకట్ కుటుంబం స్పష్టం చేసింది. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఈ విషయం తెలిస్తే ప్రభాస్ తప్పకుండా సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని వారు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.