నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఒక్క కాలేజీకి కూడా ఎన్ఎంసీ జరిమానా విధించలేదు(No Fines Imposed). దీంతో తెలంగాణ రాష్ట్రంలోని 4090 ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా కొనసాగనున్నాయి.
ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ ఫ్యాకల్టీకి పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు, అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది. వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్గా, టీచింగ్ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి, ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్మెంట్ హెచ్వోడీల సమస్య తీరనున్నది. ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలను ఈ సందర్భంగా ఎన్ఎంసీ ప్రశంసించింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది.
607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ అంశాలన్నీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎన్ఎంసీకి వివరించారు. దీంతో ఎన్ఎంసీ సంతృప్తి వ్యక్తం చేసింది.
కొన్ని టీచింగ్ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉందని ఎన్ఎంసీ లేవనెత్తింది. ఈ నేపథ్యంలో 21 టీచింగ్ హాస్పిటల్స్లో కలిపి సుమారు 6 వేలకుపైగా బెడ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రతి కాలేజీ పర్యవేక్షణకు మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు అన్ని కాలేజీల్లో పర్యటించి, కాలేజీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును ఎన్ఎంసీకి అధికారులు వివరించారు. అన్ని కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లకు భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని ఎన్ఎంసీ తెలియజేశారు. భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్ఎంసీ, అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని.. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. 4 నెలల్లో పూర్తిస్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ సూచించింది. ఈ మేరకు అన్ని కాలేజీలకూ పర్మిషన్లను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది.
మరోవైపు
ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతోంది. త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.