ఫుడ్ పాయిజన్తో 100 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
వదోదరా: వదోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలోని ఎస్డీ హాల్ హాస్టల్ లో 100 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి సమయంలో హాస్టల్లో డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఇబ్బందికి గురయ్యారు. భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు విరేచనాలు, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. మెస్లో భోజనం చేసిన సుమారు 350 మంది విద్యార్థుల్లో 100 మందికిపైగా విద్యార్థుల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించాయి. హాస్టల్ యాజమాన్యం వెంటనే విద్యార్థులను చికిత్స నిమిత్తం గోత్రి, సాయాజీ ఆస్పత్రులకు తరలించారు.
ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తెలిపారు. కలుషితమైన ఆహారం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు అనుమానిస్తున్నారు. అయితే, అదృష్టవశాత్తూ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో వర్సిటీ హాస్టల్లో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వర్సిటీకి చేరుకొని హాస్టల్ మెస్నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు.
నాణ్యతపై విద్యార్థుల ఆందోళనలు చేస్తున్నా..
మరోవైపు హాస్టల్ మెస్లో అందించే ఆహారం నాణ్యత విషయంలో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ నాణ్యత విషయంలో గతంలో చాలాసార్లు హాస్టల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి ఇలా నాసిరకం ఆహారం తింటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.