నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటకలో సీఎం మార్పు వ్యవహారంపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై సీఎం సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయమని కోరినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.
‘‘సీఎంగా నేను ఐదేళ్లూ ఉంటాను. ఈ విషయాన్ని నేను ఎప్పుడో స్పష్టంగా చెప్పాను. జులై 2వ తేదీన కూడా దీనిపై ప్రకటన విడుదల చేశాను. ఆ సమయంలో డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా పోటీదారే. అందులో తప్పు ఏముంది. ‘కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదు’ అని ఆయనే అన్నారు’’ అని పేర్కొన్నారు.