– టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
– ఆరువారాల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి
హైదరాబాద్: ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతివ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆరువారాల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి ఏటా ఓ తంతు నడుస్తోందంటూ టీఏఎఫ్ఆర్సీ తీరుపై నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు అసంతప్తి వ్యక్తం చేసింది. ఏటా కాలేజీలు ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయడం, కౌన్సెలింగ్ పూర్తయి అడ్మిషన్లు చేపట్టేదాకా దానిపై టీఏఎఫ్ఆర్సీ సిఫారసులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం అన్నది ఏటా కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ ఫీజులే 2025-26కు వర్తిస్తాయంటూ జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు కాలేజీలతో పాటు సుమారు 11 కళాశాలలు గురువారం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి మూడేండ్లకోసారి కాలేజీలను పరిశీలించి పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదన్నారు. డిసెంబరులో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు నిర్ణయం తీసుకోలేదని, 15 మంది సభ్యులదాకా ఉన్న కమిటీ నిర్ణయంలో జాప్యమెందుకన్నారు. టీఏఎఫ్ఆర్సీపై ఎందుకు ఒత్తిడి తీసుకు రాలేదని, కౌన్సెలింగ్ పూర్తయ్యాక పిటిషన్లు వేయడమేమిటని కాలేజీలను ప్రశ్నించారు. కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశారు వాదనలు వినిపిస్తూ గత డిసెంబరులో ప్రతిపాదనలు సమర్పించామని, మార్చిలో కమిటీ సమావేశమైందని, అందులో తమ ప్రతిపాదనలు ఆమోదిం చిందని, దీనికి రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలే నిదర్శనమన్నారు. టీఏఎఫ్ఆర్సీ తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు 5,000 పేజీలతో ప్రతిపాదనలు సమర్పించాయని, వీటిని పరిశీలిం చడానికి సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో గత బ్లాక్ పీరియడ్లో వసూలు చేసిన మొత్తాన్నే ఈ ఏడాదికి సిఫారసు చేసిందన్నారు. ప్రభుత్వం తరఫున రాహుల్రెడ్డి వాదనలు వినిపిస్తూ కాలేజీల్లో కొన్ని గత ఏడాది కంటే సుమారు 70 నుంచి 90 శాతం పెంపు అడుగుతున్నాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంజినీరింగ్ కళాశాలలకు చుక్కెదురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES