నవతెలంగాణ-హైదారాబాద్: రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదని ఎంపీ కంగనా రనౌత్ పేర్కొన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంతమాత్రమేనని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, పీఏలతో తమ నియోజకవర్గాలకు వాహనాల్లో వెళ్లేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని కంగనా పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఒక్కో ప్రదేశం 300-400 కి.మీ.ల దూరంలో ఉండటమే అందుకు కారణమన్నారు. కాబట్టి రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవని ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. .దీనివల్ల ఎంపీలకు వచ్చే జీతం సరిపోవట్లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని తెలిపారు. ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం అవుతుంది కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమన్నారు.
తాను రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానని ఇటీవల కంగనా పేర్కొన్నారు. ప్రజలు తన వద్దకు పంచాయతీ స్థాయి సమస్యలను కూడా తీసుకొస్తున్నారని.. ‘మీ సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించండి’ అని అంటున్నారని ఆమె అసహనం వ్యక్తంచేశారు.
కాగా, ఇటీవల హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో కంగనా ఎంపీ నియోజవర్గం మండి వరదలతో జలదిగ్భందమైంది. భారీ వరదలకు రోడ్లు, ప్రజల నివాసాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడి పలువురు మృతి చెందారు. అయితే ఆపద సమయంలో తన నియోజకవర్గ ప్రజలను పరామర్శించడంలో ఎంపీ కంగనా తీవ్ర జాప్యం చేసింది. దీంతో ఆమె తీరుతో ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహాంతో తెరుకున్న కంగానా..ఎట్టకేలకు వరదలతో అతలాకుతలమైన తన ఎంపీ నియోజకవర్గమైన మండిని సందర్శించింది.