నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అగ్రనాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఈటెల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. శామీర్పేట్లోని తన నివాసంలో ముఖ్య నేతలతో ఈటెల సమావేశమై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. అనంతరం ఈటెల రాజేందర్ బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ.. బహిరంగంగా మాట్లాడారు.
స్ట్రెయిట్ ఫైట్ చేస్తా నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను అని బండి సంజయ్ను ఉద్దేశించి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ధీరునితో కొట్లాడుతాం తప్ప.. కుట్రగాళ్లతో కొట్లాడేటోళం కాదు. ఈ కుట్రలను, కుతంత్రాలను చేసే వారి సంగతి తేల్చాల్సిన శక్తి ప్రజలకు మాత్రమే ఉంటది. రేపటి గెలుపునకు సంకేతమిచ్చే అడ్డా శామీర్పేట అడ్డా. వాడెవడో సైకోనా, శాడిస్టా, మనిషా, పశువా. వాడు ఏ పార్టీలో ఉన్నాడు. వాడు ఎవని అండతో ధైర్యం చేస్తున్నడు. కొడుకా బీ కేర్ ఫుల్ అని బండి సంజయ్ను ఈటెల రాజేందర్ హెచ్చరించారు.
మేం శత్రువులతో కొట్లాడుతాం. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి నా రక్తంలో లేదు కొడుకా. ఇవాళ ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, రెచ్చగొడుతున్నారో వారి వివరాలను పైకి పంపించే ప్రయత్నం చేస్తాను. నీ శక్తి ఏంది..? నీ యుక్తి ఏంది..? నీ చరిత్ర ఏంది..? మా చరిత్ర ఏందో తెలుసా..? 2002లో వచ్చాడు ఆ జిల్లాకు. నేను రెండు సార్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాను. రెండుసార్లు జిల్లా మంత్రిగా పని చేశాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాల్లేవు. ఒక్క హుజురాబాద్, కమలాపూర్కే పరిమితం కాదు బిడ్డా.. కరీంనగర్ జిల్లా మొత్తం నా వెంబడి వచ్చేది. నా చరిత్ర నీకు చాలా తక్కువ తెలుసు కొడుకా అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
మళ్లీ చెబుతున్నా.. హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊరిలో మన వార్డు మెంబర్, నా సర్పంచ్ ఉంటడు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎంపీకి కూడా అన్ని ఓట్లు వేయించాను. ఈ విషయం ఆయన అంతరాత్మకు తెలుసు. 2014 వరకు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు కలిపే వచ్చాయి. 2019లో ఆనాడు నువ్వు కరీంనగర్ ఎంపీగా గెలిచినా హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి 53 వేలు మెజారిటీ వచ్చింది. కేసీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడినవాడిని.. బండి సంజయ్ లాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి అని ఈటెల రాజేందర్ అన్నారు.