ఈయూ దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పీయూశ్ గోయల్
ముంబయి : యురోపియన్ యూనియన్లోని నాలుగు దేశాలకు, భారత్కు మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబరు 1 నుంచి అమలు జరగనుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ శనివారం తెలిపారు. గతేడాది మార్చి 10న ఉభయ పక్షాలు వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం కింద రాబోయే 15 ఏళ్ళలో భారత్లో వంద బిలియన్ల డాలర్ల మేరకు పెట్టుబడులకు హామీ కల్పించారు. ఈ పెట్టుబడులతో భారత్లో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించేవీలుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే స్విస్వాచ్లు, చాకొలెట్లు, పాలిష్ చేసిన వజ్రాలతో సహా పలు ఉత్పత్తులను అతి తక్కువ లేదా జీరో సుంకాలతో అనుమతిస్తారు. ఈ మేరకు గోయల్ ఎక్స్లో పోస్టు పెట్టారు. యురోపియన్ స్వేచ్ఛా వాణిజ్య అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)లో ఐస్ల్యాండ్, లిచెన్స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్య దేశాలుగా వున్నాయి. ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత పదేండ్లలోగా 50 బిలియన్ల డాలర్లు, ఆ తదుపరి ఐదేళ్ళలో మరో 50 బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈఎఫ్టీఏ ప్రకటించింది. దేశ ప్రజల ప్రయోజనాలను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దెబ్బతీస్తాయని ప్రజలు పదేపదే ఆందోళనలు వ్యక్తం చేస్తూవచ్చారు. అయితే ప్రజల ఆందోళనలను పెడచెవిన పెట్టిన మోడీ సర్కార్ ఒప్పందాల అమలుకు సంసిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.