ఈక్వెడార్లో రైతుల ఆందోళనలు
భూమి, ఉపాధి పోతుందని ఆవేదన
ప్రాజెక్ట్లో ప్రభుత్వ పెద్దల హస్తం?
క్వీటో : దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్లోని లాస్ నావేస్లో రైతులు మైనింగ్ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ గత వారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. దీని వల్ల తమ జీవనోపాధి పోతుందనీ, నీటి వనరులు కోల్పోతామని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థ దేశాధ్యక్షుడు డానియల్ నొబోవా కుటుంబ సభ్యులకు చెందిందనీ, అందుకే నిరసనలను అణిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. లాస్ నావేస్ ప్రాంతంలో బంగారం, వెండి, జింక్ వంటి విలువైన ఖనిజాలను గుర్తించారు. దీన్ని ఎల్ డోమో గని అంటారు. వీటిని వెలికితీసే ప్రాజెక్ట్ను క్యూరీమైనింగ్ సంస్థ చేపట్టింది. అయితే దీనితో తమ వ్యవసాయం, పసుసంపద, నీటి వనరులు దెబ్బతింటాయని రైతులు, గ్రామీణ ప్రజలు గతకొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. శనివారం నాడు స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నొబోవా ప్రభుత్వం నిరసనకారుల శిబిరాలను తొలగించిందని, వందలాది మందిని అరెస్ట్ చేసిందని, అనేకమంది గాయపడ్డారని ఆ దేశ మీడియా వెల్లడించింది. రాజకీయ విశ్లేషకురాలు, వామపక్ష కార్యకర్త అయిన పామెలా విటెరీ ఈ గని ప్రాజెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోతారనీ, దీని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, పోలీసుల ద్వారా నిరసనలను అణిచేసి వనరులు దోచుకోవడానికి కంపెని చూస్తుందని విమర్శించారు. మౌనంగా ఉంటే కార్పోరేట్ కంపెనీలు దేశాన్ని దోచుకుంటాయనీ, ఈ పోరాటం ఇక్కడికే పరిమితం కాదని పర్యావరణ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మైనింగ్ ప్రాజెక్ట్ వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES