నవతెలంగాణ-హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు జారీ చేశారు. జులై 23న రాణా, 30వ తేదీన ప్రకాశ్ రాజ్, ఆగష్టు 6న విజయ్ దేవరకొండ, ఆగష్టు 13న మంచులక్ష్మిలు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వీరితో పాటు మెటా, గూగుల్ సంస్థలకూ ఈడీ నోటీసులు జారీ చేసింది. జులై 28న సంబంధిత ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్సైట్ల లింక్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది.