– సీఐడీ దర్యాప్తులో వెల్లడి
– 23 యూనిట్ల నుంచి పడ్డ ఓట్లపై అధికారుల ఆరా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా జగన్మోహన్రావు ఎన్నిక అక్రమంగా జరిగిందనీ, ఇందులో నిబంధనలకు నీళ్లొదిలారని సీఐడీ తన దర్యాప్తులో తేల్చింది. హెచ్సీఏలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సీఐడీ అధికారులు దర్యాప్త చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాము అరెస్ట్ చేసిన నిందితులు జగన్మోహన్రావు, కోశాధికారి శ్రీనివాస్రావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్యాదవ్లను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న విషయం విదితమే. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నిక కావటానికి జగన్మోహన్రావు ఎంచుకున్న మార్గాలన్నీ కూడా అక్రమమని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముఖ్యంగా, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం మొదలుకొని అందులో నుంచి హెచ్సీఏలోకి ప్రవేశించటం వరకు కూడా జగన్మోహన్రావు ప్రతీ అడుగూ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దర్యాప్తులో వెలుగు చూసినట్టు సమాచారం. అంతేగాక హెచ్సీఏ ఎన్నికల సమయంలో 23 యూనిట్ల నుంచి జగన్మోహన్రావుకు పడ్డ ఓట్లపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన సీఐడీ అధికారులు.. ఆ ఓటింగ్ జరిపినవారు ఎవరనేది గుర్తించటానికి సీరియస్గా దృష్టిని సారించినట్టు తెలిసింది. అంతేగాక కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సభ్యులుగా చేర్చి ఓట్లు పొందినట్టుగా కూడా సీఐడీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో సైతం నిబంధనలకు నీళ్లొదిలారని భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తమ్మీద జగన్మోహన్రావు అండ్కో హెచ్సీఏ నిధుల దుర్వినియోగం, దాని పాలనీలో అవినీతి, అక్రమాలను సీఐడీ అధికారులు ఒక్కటొక్కటిగా తవ్వి తీస్తున్నారు.
హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్రావు ఎంపిక అక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES