Tuesday, July 22, 2025
E-PAPER
Homeక్రైమ్వీడిన జిల్లా ఎస్సీ నేత

వీడిన జిల్లా ఎస్సీ నేత

- Advertisement -

మారెల్లి అనిల్‌ హత్య మిస్టరీ
హత్య కోసం బీహార్‌ నుంచి నాటు రివాల్వర్‌
గాంధీభవన్‌ నుంచి వెంబడించి సబ్‌ స్టేషన్‌ వద్ద హత్య : మెదక్‌ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
నవతెలంగాణ-హవేలీఘనపూర్‌

మెదక్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన మెదక్‌ జిల్లా ఎస్సీ నేత మరెల్లి అనిల్‌ హత్య మిస్టరీ వీడిందని, కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేశామని మెదక్‌ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న సాయంత్రం 8 గంటల సమయంలో వరిగుంతం సబ్‌ స్టేషన్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మరెల్లి అనిల్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన సోమన్నగారి రవీందర్‌ రెడ్డి, మరెల్లి అనిల్‌ మధ్య అనేక విభేదాలు ఈ హత్యకు దారి తీశాయని తెలిపారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ మహేందర్‌ పర్యవేక్షణలో ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, ఏడుగురు ఎస్‌ఐలతో కలిసి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏ విధమైన ఆధారాలు లేని కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించగా, ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కుల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన సోమన్నగిరి రవీందర్‌ రెడ్డి ఏ1గా, రంగంపేట్‌ గ్రామానికి చెందిన పడేపు నాగరాజు ఏ2 గా, ఏ3గా పడేపు నాగభూషణం, ఏ4 శాబోద్దిన్‌, ఏ5 ఫరీద్‌, ఏ6 చిన్నా (విజయవాడ) ఏ7 తలారి అశోక్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వీరిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 103(1), ఆర్మీ యాక్ట్‌ సెక్షన్‌ 25(1), 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యకు వాడిన సిప్ట్‌ కారు, మారుతి కారును ధ్వంసం చేశారు. టియాగో కారు, డీసీఎం, పిస్టల్‌తో పాటు సెల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ మహేందర్‌, మెదక్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌, రూరల్‌ సీఐ రాజశేఖర్‌, అల్లాదుర్గ్‌ సీఐ రేణుక రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -