– మరో 681 మందికి పింఛన్ల మంజూరు : ఫైల్పై సంతకం చేసిన మంత్రి డాక్టర్ సీతక్క
– రాష్ట్రంలో లబ్దిపొందుతున్న లబ్దిదారుల సంఖ్య 8,721
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాసంకల్పంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డయాలసిస్ చికిత్స పొందుతున్న మరో 681 పేద రోగులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పింఛన్ మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించింది. పింఛన్ మంజూరు ఫైల్పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) తాజాగా సంతకం చేశారు. ఈ పింఛన్ల డయాలసిస్ రోగులకు ఇతోధికంగా ఉపయోగపడుతుందని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రవ్యాప్తంగా 4,011 మంది డయాలసిస్ పేషెంట్లు మాత్రమే పింఛన్ అందుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఇప్పటిదాకా 4,029 మంది డయాలసిస్ రోగులకు పింఛన్ మంజూరు చేసింది.
తాజాగా మరో 681 మంది లబ్దిదారులను కొత్తగా ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్న డయాలసిస్ రోగుల సంఖ్య 8,721కి చేరుకున్నది. ఈ పింఛన్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గుర్తింపు పొందిన వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందుకుంటున్న రోగుల వివరాల ఆధారంగా మంజూరు చేశారు.
ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ రోగుల వివరాలను సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) సాంకేతికంగా పరిశీలించి, ధ్రువీకరించిన అనంతరం పింఛన్ మంజూరు చేసింది. ఈ 681 మంది లబ్ధిదారుల్లో హైదరాబా ద్లోనే 629 మంది వివిధ ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. మిగిలిన 52 మంది పేషెంట్లు ఇతర జిల్లాలకు చెందినవారు. ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితిలో లేని ఈ రోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పింఛన్లను మంజూరు చేసింది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి నెలనెలా చేయూత పింఛన్ అందనున్నది. ఇది ఒక వైపు ఆరోగ్య భద్రత, మరోవైపు ఆర్థిక భరోసా కల్పించే ప్రజా ప్రభుత్వానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలువనున్నది.
డయాలసిస్ రోగులకు ‘చేయూత’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES