నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 111 మంది విద్యార్థులు విషాహారం తిని,
ఆస్పత్రి పాలైతే కనీసం చీమకుట్టినట్టైనా లేదా రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటు
అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేటు భోజనం, గురుకులాల్లో మాత్రం కలుషిత ఆహారం
మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – తిమ్మాజిపేట
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురుకులాల్లో జరుగుతున్న సంఘటనపై సుమోటోగా కేసు స్వీకరించాలని మాజీ మంత్రి హరీశ్ రావు రెండు చేతులెత్తి జోడించి అభ్యర్థించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజ్ తో కలిసి ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో చాతున్న విద్యార్థులను పరామర్శించారు. ఇందులో భాగంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మేము వస్తున్న విషయం తెలుసుకొని హడావుడిగా పోలీసులను పెట్టి పిల్లలను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఇంకొంతమంది విద్యార్థులకు చేతికి క్యాండిల్ తోనే చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ఎందుకు దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా, వారికి సరైన వైద్యం అందించకుండా ఎందుకు హడావిడిగా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని అన్నారు. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని రోజుల క్రిందటనే పెద్దకొత్తపల్లి హాస్టల్లో విషపూరిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. అలాగే జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెంలలో విషాహారం తిని ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఏదోచోట గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన వార్తలు చూడవలసి వస్తుందన్నారు.
20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో వంద మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. వందమంది విద్యార్థులు చనిపోయినా మీ గుండె కరగదా రేవంత్ రెడ్డి. గురుకుల విద్యార్థుల గురించి పట్టించుకోవా.? బావి భారత పౌరులైన ఈ విద్యార్థుల భవిష్యత్తుపైన మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడం కూడా చేతకాదా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి బాలల దినోత్సవం నాడు ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే అధికారులను సస్పెండ్ చేస్తా అని ప్రగల్బాలు పలికాడు. నువ్వే విద్యాశాఖ మంత్రివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే కూడా స్పందించవా.. అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టావు అందాల భామలను చూడడానికి అందాల పోటీలకు ఐదుసార్లు పోయావు. మరి అనారోగ్యానికి గురైన ఈ పిల్లలను చూడడానికి ఆస్పత్రికి రావా అని ప్రశ్నించారు.
ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఆసుపత్రి పాలైతుంటే వాళ్ళని పరామర్శించాలని ఎందుకు మీకు అనిపించదు వారికి మంచి భోజనం పెట్టాలని ఎందుకు నీకు అనిపించదు. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అంటే ఏమిటి రేవంత్ రెడ్డి ఆనవాళ్లు మార్చడం అంటే విద్యార్థులు గురుకుల నుండి టీసీలు తీసుకుని వెళ్లిపోవడమా అని మండిపడ్డారు. ఆనవాళ్లు మార్చడం అంటే గురుకుల పిల్లలను ఆస్పత్రి పాలు చేయడమా? ఆ పిల్లలను పొట్టన పెట్టుకోవడమా? కేసీఆర్ 284 గా ఉన్న గురుకులాలను 1,023 గురుకులాలకు పెంచిండు. 1,60,000 మంది ఉన్న గురుకులాల్లో కేసీఆర్ ఆరు లక్షల మంది విద్యార్థులు చదివే సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురుకులాలను ఆగం చేశాడు. ఇంటిగ్రేటెడ్ స్కూలు పెడతా అని డబ్బా కొట్టిన రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో ఒక ఇటుక పెట్టింది లేదు.
ఒక స్కూల్ కట్టింది లేదు. ఉన్న గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఏడిపించే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఒక విద్యార్థిని తల్లి రూప అనే మహిళ నన్ను కలిశారు. వారు బండై గుట్ట గ్రామం కొల్లాపూర్ నుంచి వచ్చారు నిన్న వారి బిడ్డ కలుషిత ఆహారం తిని ఆసుపత్రిపాలైందని తెలిసి వచ్చింది. ఆదివారం రోజు విద్యార్థులకు పెట్టవలసింది పూరి, చపాతి. కానీ ఉదయం పెట్టింది సాంబారు అన్నం ఆ సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని ఆ తల్లి స్వయంగా చూసి చెప్పిందని అన్నారు. గురుకులాల్లో మెనూ కూడా ఈ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రతీరోజు ఏదో ఒక జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అన్ని జిల్లాలో రోజుకి 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసి వారి జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నాడు.
పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి. బీఆర్ఎస్ మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరుకోదన్నారు. మళ్లీ గురుకుల బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్ లో జరుగుతున్న సంఘటనలపై విచారణ చేసి సుమోటో గా కేసు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రెండు చేతులు జోడించి అభ్యర్థించారు. బీసీ హాస్టల్లో ఇంకా బెడ్ షీట్స్ రాలేదు, కాస్మోటిక్ బిల్లులు రాలేదు. కొన్ని హాస్టల్లో ఇంకా విద్యార్థులకు బట్టలు కూడా రాలేదని అన్నారు. రాజకీయాలు ఉంటే ఎన్నికలప్పుడు చేసుకుందాం. కేసీఆర్ మీద మా మీదన కోపం ఉంటే కేసులు పెట్టు కానీ విద్యార్థులను ఇబ్బంది పెట్టకు. నీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చరించారు.