– ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినయ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదర్శ వివాహాలను ప్రభుత్వం, పౌరసమాజం ప్రోత్సహించాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయకుమార్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే) ఆధ్వర్యంలో టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఎల్లికంటి కీర్తి,అక్కి ప్రశాంత్ల ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా వినయకుమార్ మాట్లాడుతూ కుల మతాంతర వివాహాలు చట్టవిరుద్ధం కాదని చెప్పారు. స్వకుల వివాహాలు సమాజాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయనీ, మత, కులపరమైన ఆచారాల పేరుతో ఆధునిక మానవులను మధ్యయుగాల కాలంలోకి నడిపిస్తున్నారని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి అవుతున్నప్పటికీ మత, కుల పరమైన విద్వేషాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నూతన దంపతులు సమాజాన్ని అర్థం చేసుకుని పురోగమన ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు ఈ ఆదర్శ వివాహంలో పూల దండలు మార్పించి ప్రమాణ పత్రాలు చదివించారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్ టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐత విజరు కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు డి కిరణ్, అశోక్ రెడ్డి, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆదర్శ వివాహాలను ప్రభుత్వం, పౌర సమాజం ప్రోత్సహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES