– ఆగస్టు 22న విడుదలయ్యే ‘యూనివర్సిటీ’ సినిమాని ఆదరించాలి : సినీ నటులు ఆర్. నారాయణమూర్తి
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
నేడు చదువు కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్నదని, చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులు వచ్చాయని సినీనటులు, దర్శకులు పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ‘యూనివర్సిటీ.. పేపర్ లీకేజ్’ సినిమా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా పేపర్ లీకేజీ అనేది సర్వసాధారణంగా మారిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పేపర్ లీక్ అవ్వడం, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యార్థుల పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం అంటే సమాజాన్ని నాశనం చేయడమేనని అన్నారు. సేవా రంగంగా ఉండాల్సిన విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చారని ఆరోపించారు. తన సినిమాని ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో చూసి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, తదితర విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సామాజిక అసమనతులపై, విద్య, వైద్యం, క్లాసిఫికేషన్, క్యాస్టిఫికేషన్ అంశాలపై సినిమాలు తీస్తూ తన జీవితాన్ని కళామ్మ తల్లికి అంకితం చేసి, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నారాయణ మూర్తి పాటుపడుతున్నారని అన్నారు. సినిమా రూపంలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వెండితెరపై దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కండ్లకు కట్టినట్టు చూపించారని తెలిపారు. కార్పొరేట్ కబంధహస్తాల్లో చిక్కుకున్న చదువుపై చిత్రాన్ని రూపొందించారని, అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణ్, నాయకులు వినరు, హర్షద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన రవితేజ, జిల్లా సమితి సభ్యులు వినరు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ, యూనివర్సిటీ అధ్యక్షులు విజరు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ల చేతుల్లో చదువు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES