– పెండింగ్లో రూ.8158 కోట్ల స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు
– సంక్షేమ హాస్టళ్ల సంరక్షణ -ప్రభుత్వ విద్యాపరిరక్షణ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్ల సంరక్షణ- ప్రభుత్వ విద్యాపరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్రను బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. ఈ యాత్ర ఆగస్టు 6 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8158 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయి బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ హాస్టల్, గిరిజన గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం ప్రత్యేక కమిటీ వేసి విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రల ద్వారా విద్యార్థుల దగ్గరికి వెళ్లి స్వయంగా సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యేందుకు భవిష్యత్లో సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, నాయకులు, విద్యార్థులు సైదా నాయక్, కుంచం కావ్య, కోరే రమేష్, బుకింగ్ వేంకటేష్, మరుపాక కిరణ్, ముస్కు రవీందర్, స్పందన, సిరి, జగదీష్, జగన్ నాయక్, వీరన్న, రాకేష్, సాయి, నవదీప్, ప్రణరు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES