ఇక నుంచి సమయ పాలన తప్పనిసరి
ఆస్పత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్
నిన్నటి నుంచే అమల్లోకి..నాణ్యమైన వైద్య సేవలందించేందుకు చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
డుమ్మా వైద్యులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారికి చెక్ పెట్టేలా చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది వైద్యులు సమయపాలన పాటించకపోవడం, ఇష్టానుసారంగా విధులు నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు, సిబ్బందికి ఆధార్ బేస్డ్ అటెండెన్స్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆయా పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లలో పనిచేసే వైద్యులు, సిబ్బంది వివరాలను సంబంధిత శాఖ అధికారులు సేకరించారు. ఆధార్ నెంబర్ తోపాటు వెల్నెస్ సెంట్, ఇతర వివరాలు నమోదు చేసుకు న్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే ఉద్యోగులకు శిక్షణ సైతం ఇచ్చారు. ఈ ప్రక్రియ ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది.
పీహెచ్సీలన్నింటిలోనూ..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సబ్ సెంటర్లలో చాలా మంది వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీ చేసిన సమయంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడాన్ని ప్రభుత్వం గమనించింది. కొన్ని పీహెచ్సీలకు రోగులు వచ్చినప్పుడు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేక ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. అత్యవసర సమయంలో ప్రాణం సైతం పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్సులు, కింది స్థాయి సిబ్బందితోనే నామమాత్రంగా వైద్య సేవలందిస్తున్నారు. ఇలాంటి వాటికి ఆధార్ బెస్ట్ అటెండెన్స్ చెక్ పెట్టనుంది. కోవిడ్కు ముందు జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో బయోమెట్రిక్ హాజరు అమలులో ఉండేది. వివిధ కారణాలతో అవి మూలనపడ్డాయి. విధానం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఆయా పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులు కొందరు ప్రయివేటు క్లినిక్లు ఏర్పాటు చేసుకుని మధ్యాహ్నమే ఇంటి ముఖం పడుతున్నారు. ఇలాంటి వారి గురించి ఆధార్ బేస్డ్ అటెండెన్స్తో బయటపడనుంది. సెల్ఫోన్లో ఫేషియల్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. పీహెచ్సీకి 50 మీటర్ల దూరం నుంచి ఈ యాప్ పని చేస్తుంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారితోపాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఈ యాప్ అనుసంధా నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడూ వివరాలు వారికి అందు తాయి. హాజరు వేసిన వైద్యుల లొకేషన్ షేర్ అవుతుంది. ఏ సమయానికి వచ్చారు..? ఏ సమయానికి వెళ్తున్నారు..? నెలలో ఎన్నిసార్లు రావడం లేదనే విషయాలు తెలుస్తాయి. వీటి ఆధారంగానే వేతనాలు చెల్లిస్తారని వైద్యశాఖ అధికా రులు చెబుతున్నారు. ఈ విధానం సక్రమంగా అమలైతే రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.
ముహూర్తం ఖరారు
రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఆస్పత్రుల్లో ఆధార్ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నెల 1 నుంచి అమలు చేయాలని వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్త్ ఆదేశాలు జారీ చేశారు. డీఎంఅండ్హెచ్ఓల పరిధిలోని ఆస్పత్రులతోపాటు ఆయూష్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లోనూ అమలు కానుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ అభివద్ది చేసిన మొబైల్ ఫేషియల్ అథెంటిక్ సిస్టంను అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఖమ్మం జిల్లాలో ఈ విధానం అమలు చేయగా, అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్యశాఖ అమలు చేస్తోంది.
డుమ్మా డాక్టర్లకు చెక్..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES