నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్లో SIR పేరుతో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అందుకు సంబంధించిన ముసాయిదాను ఈసీ విడుదల చేసింది. తాజాగా ఆ ముసాయిదాపై ఆర్జేడీ నేత ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ముసాయిదా జాబితాలో తన పేరే లేదని ఆరోపించారు. పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘నా ఈపీఐసీ నంబరుతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో చెక్ చేశా. ఈ ముసాయిదా జాబితాలో నా పేరు కన్పించలేదు. ఇక నేను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి? స్వయంగా బూత్ లెవల్ అధికారి నావద్దకు వచ్చి ఫామ్ తీసుకెళ్లారు. అయినా నా పేరు జాబితాలో లేదు’’ అని తేజస్వీ వెల్లడించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 20వేల నుంచి 30వేల వరకు ఓటర్లను తొలగించాలని ఆర్జేడీ నేత ఆరోపించారు. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించారని పేర్కొన్నారు.
అయితే, తేజస్వీయాదవ్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ముసాయిదా జాబితాలో ఆయన పేరు ఉందని పేర్కొంది. అందుకు సంబంధించిన కాపీని కూడా విడుదల చేసింది. ఆర్జేడీ నేత బహుశా తన పాత ఈపీఐసీ నంబరుతో చెక్ చేసుకుని ఉంటారని, అందుకే ఆయన పేరు జాబితాలో కన్పించకపోయి ఉండొచ్చని ఈసీ తెలిపింది.