– ఆర్బీఐ పావు శాతం తగ్గించొచ్చు
– ఎస్బీఐ అంచనా
ముంబయి : అధిక వడ్డీ రేట్లను క్రమంగా ఉపశమనం లభించే సంకేతాలు కనబడుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 4 నుంచి 6 వరకు నిర్వహించనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రెపోరేటును 25 బేసిస్ పాయిట్లు తగ్గొంచొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అంచనా వేసింది. మరో పావు శాతం తగ్గింపు ద్వారా దీపావళి ముందు రుణ వృద్ధికి మద్దతును ఇచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఇంతక్రితం జూన్లో జరిగిన ఎంపీసీ సమీక్షలో కీలక రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా రెపోరేటును 5.50 శాతానికి చేర్చింది. ఫిబ్రవరిలోనూ 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్లు చొప్పున వడ్డీ రేట్లను తగ్గించింది. మొత్తంగా రుణాలపై వడ్డీ ఒక్క శాతం మేర కోత విధించడంతో పాత, కొత్త గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలకు కొంత వడ్డీ భారం తగ్గింది. కాగా పలు ప్రయివేటు బ్యాంక్లు ఈ ప్రతిఫలాలను ఖాతాదారులకు బదిలీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయనే రిపోర్టులు వచ్చాయి.
”ఆర్థిక సంవత్సరం 2025-26లో పండుగ సీజన్ కూడా ముందస్తుగా ఉండటం వల్ల ఈ నిర్ణయం మరింత ప్రభావవంతంగా ఉండొచ్చు. ఇది వరకు దీపావళి ముందు రేటు తగ్గింపు జరిగినప్పుడు పండుగ సీజన్లో రుణ వృద్ధి భారీగా పెరిగింది. 2017 ఆగస్టులో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత దీపావళి నాటికి రూ.1,95,600 కోట్ల అదనపు రుణాల జారీ నమోదయ్యింది. ఇందులో 30 శాతం వ్యక్తిగత రుణాలు చోటు చేసుకున్నాయి.” అని ఎస్బీఐ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం మరింత తగ్గే వరకు లేదా ఆర్థిక వృద్ధి స్పష్టంగా మందగించే వరకు రేటు తగ్గింపును వాయిదా వేయడం వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. వేచి ఉండడం వల్ల ప్రయోజనం తక్కువని.. చర్య తీసుకోకపోవడం వల్ల ఉత్పత్తి, పెట్టుబడి విశ్వాసానికి నష్టమని తెలిపింది.
మరోసారి వడ్డీ రేట్ల తగ్గింపు..!
- Advertisement -
- Advertisement -