Monday, August 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపంప్డ్‌ స్టోరేజ్‌ని వినియోగంలోకి తీసుకురావాలి

పంప్డ్‌ స్టోరేజ్‌ని వినియోగంలోకి తీసుకురావాలి

- Advertisement -

– రాబోయే 20 ఏండ్లకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు :ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిలలో జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం
నవతెలంగాణ-కొల్లాపూర్‌

హైడల్‌ పవర్‌తో పాటు పంప్డ్‌ స్టోరేజ్‌తో పెద్ద ఎత్తున విద్యుత్‌ ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని, దానికోసం రాష్ట్రంలో ఇరవై మూడు పాయింట్స్‌ను గుర్తించి వాటి మీద సమగ్రమైన రిపోర్టు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పరిధిలోని సోమశిల వద్ద జెన్‌ కో, ట్రాన్స్‌ కో అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. జూరాల నుంచి పులిచింతల వరకు కృష్ణానది మీద ఉన్న హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లను సమీక్ష చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అవసరం అయితే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కన్సల్టెంట్ల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. సోలార్‌ ద్వారా పగలు జరిగే ఉత్పత్తిని స్టోరేజ్‌ చేసి రాత్రివేళ ఉపయోగానికి అవసరమైన సాంకేతికను, దానికి అవసరమైన స్టోరేజ్‌ వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. ముందుచూపుతో అత్యాధునికమైన సాంకేతికతను పరిచయం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 1978లోనే ఆనాటి పాలకులు, ఇంజనీర్లు లోతుగా అధ్యయనం చేసి రివర్స్‌ పంపింగ్‌ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్‌కు చెందిన తొషిబా, మిస్టుబుషి లాంటి దిగ్గజ సంస్థల సాంకేతికతను ఉపయోగించిన తీరును, వారి ముందుచూపును కొనియాడారు. రాబోయే తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ హితమైన పవర్‌ను ఉత్పత్తి చేసి అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రాబోయే 20 ఏండ్లకు సరిపడా విద్యుత్తు డిమాండ్‌కు అవసరమైన ఉత్పత్తిని అందుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. కాగా, ఈ ఏడాది డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరాయంగా విద్యుత్‌ను అందించిన సిబ్బందిని డిప్యూటీ సీఎం అభినందించారు. సీఎండీ నుంచి కింది సిబ్బంది దాకా వాళ్ళకి అవసరమైన సాంకేతికతను పెంపొందించడానికి అవసరమైన సిలబస్‌ను రూపొందించి మూడు రోజుల ట్రైనింగ్‌ నిర్వహించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -