నవతెలంగాణ – హైదరాబాద్: భారత మత్స్యకారుల పట్ల శ్రీలంక నేవీ మరోసారి కఠినంగా వ్యవహరించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటి తమ జలాల్లో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అదుపులోకి తీసుకుంది. సోమవారం రాత్రి శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లోని మన్నార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. జాలర్లతో పాటు వారి రెండు మర పడవలను కూడా శ్రీలంక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరం, పాంబన్కు చెందిన ఈ మత్స్యకారులను అరెస్ట్ చేసిన అనంతరం మన్నార్లోని ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. విదేశీ పడవల అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకే నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని, స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని శ్రీలంక నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. జాలర్లను, వారి పడవలను తక్షణమే విడిపించేందుకు దౌత్య మార్గాల ద్వారా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు లేఖ రాశారు. ఈ సమస్య పదేపదే పునరావృతం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీలంక చెరలో 68 మంది భారత జాలర్లు, 235 పడవలు ఉన్నాయని స్టాలిన్ తన లేఖలో గుర్తుచేశారు. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 185 మంది భారత జాలర్లను శ్రీలంక అరెస్ట్ చేసిందని, 25 పడవలను స్వాధీనం చేసుకుందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన జాలర్లను వెంటనే విడుదల చేయాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తమిళనాడు మత్స్యకార సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.