నవతెలగాణ – హైదరాబాద్; దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ దగ్గరి బంధువు, సోదరుడైన ఆసిఫ్ ఖురేషీ (42) హత్యకు గురయ్యారు. కేవలం స్కూటర్ పార్కింగ్ విషయంలో చెలరేగిన చిన్న గొడవ ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది. ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు తమ స్కూటర్ను అడ్డంగా పార్క్ చేశారు. ఇంటికి దారి లేకుండా ఉండటంతో స్కూటర్ను పక్కకు జరపమని ఆసిఫ్ వారిని కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.