– వన్యప్రాణుల కదలికలు కమాండ్ కంట్రోల్కు అనుసంధానం
– అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలి
– అటవీ జంతువుల దాడి బాధితులకు తక్షణ పరిహారం
– అధికారుల ప్రమోషన్లు, అవార్డులకు ప్రతిపాదనలు పంపండి : అటవీ శాఖ సమీక్షలో సీఎం ఎ.రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అటవీశాఖ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. అడవుల్లో వన్య ప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటినీ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో అటవీశాఖపై సీఎం రేవంతరెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ హించారు. అందులో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎలుసింగ్ మేరు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలున్నాయని గుర్తుచేశారు. మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు, అందులోనే నదులు, జలపాతాలు ఉన్నా ఎందుకు ఆ స్థాయిలో విజయవంతం చేయడం లేదని ప్రశ్నించారు. ఆ వనరులను సద్వినియోగం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులున్నా తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళ్తుండటాన్ని ప్రస్తావించారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్య పెంచేలా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలనీ, ఆ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వరంగల్ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన వరంగల్లో జూను ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. అటవీ జంతువుల దాడిలో మరణించిన, గాయపడిన వారికి, పశువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దానికి సీఎంఆర్ఎఫ్ నుంచి అవసరమైన మేరకు నిధులు వినియోగించుకోవాలని సూచించారు. అటవీ శాఖలో అధికారుల కొరతపై ఆరా తీశారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్రదించాలని సీఎస్కు సూచించారు. అటవీ శాఖలో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. శాఖలో ఉత్తమ పని తీరు కనబర్చుతున్న వారికి అవార్డులను ఇచ్చే ప్రక్రియను పునరుద్ధరించాలని నొక్కి చెప్పారు. అటవీ శాఖ పరిధిలో చేపడుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల విషయంలో అటవీ శాఖ, ఆయా పనులు చేపడుతున్న శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి సాధ్యమైనంత త్వరగా అనుమతులను సాధించాలన్నారు.
ఎకో టూరిజంపై దృష్టి పెట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES