36 తులాల బంగారం, రూ.35 వేలు అపహరణ
నవతెలంగాణ – ముషీరాబాద్
హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఒక అపార్ట్మెంట్లోని భారీ చోరీ జరిగింది. మరమ్మతులు జరుగుతున్న ఓ ఫ్లాట్లో డోరు తెరిచి ఉండటంతో లోపలికి వచ్చిన దొంగ బీరువాలో ఉన్న 36 తులాల బంగారం, రూ.35 వేలు ఎత్తుకెళ్లాడు. పూర్తి వివరాల్లోకెళ్తే.. వివేక్నగర్ త్యాగరాయగానసభ సమీపంలోని దిట్టకవి ఎంక్లేవ్ అపార్ట్మెంట్ రెండో అంతస్తులో డి.నారాయణ అనే మిథాని కంపెనీ విశ్రాంత ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. సదరు ఫ్లాట్ ప్రధాన ద్వారం తలుపులకు చెదలు పట్టడంతో కొత్త తలుపులు బిగించడానికి పనులు జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఏదో శబ్దం వినిపించి నారాయణ బయటకు వచ్చి చూశాడు. నిద్రపట్టక మళ్లీ రెండు సార్లు బయటకు వచ్చి చూసిన ఆయన మూడోసారి మరమ్మతులో ఉన్న తలుపులకు గొళ్లెం వేయడం మరిచిపోయి పడుకున్నాడు. అదే సమయంలో అపార్ట్మెంట్ వెనుక వైపు నుంచి ఒక అగంతకుడు ఇంటి లోపలికి వచ్చాడు. బీరువా తాళాలు దానికే ఉండటంతో 36 తులాల బంగారం, రూ.35 వేలు దోచుకెళ్లాడు. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు దొంగతనం జరిగినట్టు గుర్తించి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్, డీఐ శంకర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికివచ్చి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు ఆధారాలు సేకరించడంతో పాటు సీసీ కెమెరాలను తనిఖీ చేసి అగంతకుని కోసం దర్యాప్తు చేపట్టారు. కాగా, వెంటనే రంగంలోకి దిగిన చిక్కడపల్లి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి మధ్యాహ్నానికి పట్టుకుని బంగారం, నగదును రికవరీ చేసినట్టు సమాచారం.
చిక్కడపల్లిలో భారీ చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES