2.98 లక్షల మెట్రిక్ టన్నుల లోటుతో రైతులకు ఇబ్బందులు
మండలాల వారీగా అవసరాలను బట్టి కేటాయించాలి
కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేటాయించిన యూరియాను సరఫరా చేయకపోవడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రం తీరు వల్ల రాష్ట్రంలో రూ.2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందని చెప్పారు. దీంతో రైతులకు పంటకు సరపడా యూరియాను సరఫరా చేయలేకపోతున్నామని వివరించారు. రాష్ట్రంలో యూరియా పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత జిల్లా అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏప్రిల్లో 1.7, మేలో 1.6, జూన్లో 1.7, జులైలో 1.6, ఈనెలలో 1.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని వివరించారు. కానీ ఏప్రిల్లో 1.21, మేలో 0.88, జూన్ లో 0.98, జులైలో 1.43, ఈనెలలో 0.82 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయలేక పోవటం వల్ల రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందని చెప్పారు. దీంతో రైతులకు పంటకు సరిపడా యూరియాను ఒకేసారి అందించలేకపోతున్నామని వివరించారు. లోటును దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలనీ, హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాముల్లో రోజువారి యూరియా స్టాక్ను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ నుంచి వచ్చే వివరాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుని మండలాల వారీగా అవసరానికి అనుగుణంగా కేటాయింపు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. యూరియా సరఫరాలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలనీ, పెద్ద రైతుల అవసరాలకు విడతల వారీగా సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే పట్టాదారు పాసుపుస్తకాలు అనుసంధానం చేయాలన్నారు. రైతులకు టోకెన్లు జారీ చేసి ఎలాంటి గందరగోళం లేకుండా యూరియా సరఫరా చేయాలనీ, వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, అన్ని శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక ధరలకు విక్రయించే లేదా ఇతర ఉత్పత్తులతో కట్టిపెట్టే ప్రయివేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియా మళ్లించే అవకాశమున్న యూనిట్లపై తనిఖీలు చేసి, వారి ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి, ఏమైనా పెద్ద వ్యత్యాసం ఉంటే డీలర్, యూనిట్పై కేసులు నమోదు చేయాలన్నారు. మండలాల వారీగా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి, వ్యవసాయశాఖ, పోలీస్, సహకార సంస్థలతో సమన్వయం చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. యూరియా సరఫరా సాధారణ స్థితికి చేరేవరకు కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడే మాటలకు భయాందోళనలకు గురై యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేయొద్దని రైతులను కోరారు.
కేంద్రం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES