సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ
– రామన్నపేటలో ఘనంగా ప్రజానాట్యమండలి వీధినాటకోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజాపాటకు బహువచనం ప్రజానాట్యమండలి అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ప్రజానాట్యమండలి యాదాద్రిభువనగిరి జిల్లా మూడో మహాసభ సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో బుధవారం జానపద వీధి నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ జానపద కళాకారులు తహసీల్దార్ కార్యాలయం సభా వేదిక వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ ప్రదర్శనను ప్రారం భించారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ”సుద్దాల హనుమంతు యాదిలో.. ప్రజాకవి సుద్దాల హనుమంతు కళాప్రాంగణంలో” సప్దర్ హష్మీ ఓపెన్ థియేటర్ షాట్ -2025ను సుద్దాల అశోక్ తేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి ప్రజా పోరాటాల వరకు ప్రజానాట్యమండలిది వన్నె తెగ్గని పాత్ర అన్నారు. జానపద రూపాలు అంతరించిపోతున్న ఈ తరుణంలో సబ్బండ కళారూపాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ప్రజా కళలకు చావులేదని, భూ ప్రపంచం ఉన్నంతవరకు, ప్రజా పోరాటాలు ఉన్నంతవరకు పాటకు ప్రాణం ఉంటుంద న్నారు. రామన్నపేట మండలంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు సుద్దాల హనుమంతు నడయాడారని, వారి యాదిలో కళాప్రదర్శన నిర్వహించడం ఆనందదాయకమని చెప్పారు.
మాజీ ఎమ్మెల్సీ, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలకు ఆయుధం ఇచ్చింది కళారూపాలేనన్నారు. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న వింత పోకడలో ప్రజాకళలు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని, సినిమాలు, ఇతర రూపాల్లో అవి వికృతరూపం దాల్చుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజానాట్యమండలి ప్రజల కళారూపాలను భుజానికి ఎత్తుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. అనంతరం చిందు యక్షగాణం, భాగవతం, కోలాటం డప్పులు, బుర్రకథలు తది తర కళారూపాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, తెలంగాణ సాంస్కృతిక సారథిó జిల్లా కోఆర్డినేటర్, ప్రజాగాయని వేముల పుష్ప, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, దేశపాక రవి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు కూరెళ్ల నర్సింహాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పుల వెంకన్న, మండల అధ్యక్ష కార్యదర్శులు మేడి పృథ్వీ, గంటపాక శ్రీకృష్ణ, కందుల హనుమంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జల్లెల పెంటయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.