– మూసీ అభివృద్ధి పనులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మూసీ అభివృద్ధి కోసం అన్ని ఏర్పాట్లు చేసి, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ను భారీగా పెంచి దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నీళ్లను హైదరాబాద్కు దగ్గరలోని కొండపోచమ్మ సాగర్కు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అలాగే, కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట చెరువుకు గోదావరి నీళ్లను తరలించడానికి 2022 లోనే రూ.1,100 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. మూసీ నదిలో చేరే 2 వేల ఎమ్ఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేయడం కోసం మొత్తం 36 ఎస్టీపీల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసిందీ కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. మూసీ నదిలో 5 కిలోమీటర్ల మేర నాగోల్ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టి, మూసీ నది ఒడ్డున ఉప్పల్ భగాయత్లో శిల్పారామాన్ని ఏర్పాటు చేసిందీ గత ప్రభుత్వమేనని వివరించారు. ఢిల్లీకి మూటలు పంపుతూ తమ పదవిని కాపాడుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయ పడుతోందని, దానికి ‘నగర అభివద్ధి’ అనే అందమైన ముసుగు వేసుకుందని విమర్శించారు. వాటన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతూ, మరోవైపు అదే ప్రాజెక్టు నుంచి నీళ్లను వాడుకుంటామనడం కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ నీతికి నిదర్శనమని తెలిపారు.