నవతెలంగాణ-హైదరాబాద్: గాజా నగరాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయిల్ బెదిరింపులకు దిగింది. గాజాపై అమానుషంగా దాడులకు తెగబడుతూ, సాయన్ని కూడా నిలిపివేసిన ఇజ్రాయిల్..గాజాను పూర్తిగా ఆక్రమించుకునేందుకు దాడులను ఉధృతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. హమాస్ నిరాయుధీకరణకు అంగీకరించకపోతే, ఆ భూభాగంలో మిగిలిన బందీలను విడుదల చేయకుంటే, ఇజ్రాయిల్ షరతులకు లోబడి యుద్ధాన్ని ముగించకుంటే గాజా నగరాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ శుక్రవారం ప్రతిజ్ఞ చేశారు. ”బందీలను విడుదల చేయడం , నిరాయుధీకరణ వంటి ఇజ్రాయిల్ షరతులకు అంగీకరించి యుద్ధాన్ని ముగించకుంటే.. త్వరలో గాజాలో హమాస్ హంతకులు, రేపిస్టుల తలలపై నరకం ద్వారాలు తెరుచుకుంటాయి” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైన రెండు నగరాలను ప్రస్తావిస్తూ.. ”హమాస్ అంగీకరించకపోతే వారి రాజధాని గాజా, రఫా మరియు బీట్ హనౌన్ల్లాగా మారుతుంది” అని బెదిరింపులకు దిగారు.
గాజాలో మిగిలిన బందీలందరినీ విడిపించే లక్ష్యంతో తక్షణ చర్యలకు ఆదేశించినట్లు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ గురువారం రాత్రి వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. గాజాను తమ ఆధీనంలోకి తీసుకుని, హమాస్ స్థావరాన్ని నాశనం చేసే ఆపరేషన్తో పాటు బందీలను విడుదల చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఈ వారం ప్రారంభంలో గాజాను ఆక్రమించుకునేందుకు సుమారు 60,000 మంది రిజర్వ్ సైనికులను మోహరించేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.