నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింఘేను శనివారం జైలు ఆసుపత్రికి తరలించారు. బ్లడ్ షుగర్ లెవల్, రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉండడంతో.. అధికారులు జైలు ఆసుపత్రిలో చేర్పించినట్లు జైలు ప్రతినిధి జగత్ వీరసింఘే శనివారం కొలంబోలో తెలిపారు. విక్రమ్సింఘే తన పదవీ కాలంలో 16.6 లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై శుక్రవారం సిఐడి (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) ప్రధాన కార్యాలయంలో అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సిఐడి అధికారులు వాంగ్మూలం నమోదు చేయడానికి విక్రమ్సింఘేను కార్యాలయాలనికి పిలిపించారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయడం జరిగింది.ఈ కేసులో కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు ఆగస్టు 26 వరకు రిమాండ్ విధించింది. కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. శుక్రవారం అర్ధరాత్రి ఆయనను మ్యాగజైన్ రిమాండ్ జైలుకు తరలించారు. జైలుకి తరలించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ కేసులో సిఐడి విక్రమ్సింఘేపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 386, 388 కింద పబ్లిక్ ప్రాపర్టీస్ చట్టంలోని సెక్షన్ 5(1) కింద అభియోగాలు మోపింది. ఈ అభియోగాలకు ఒక సంవత్సరం కంటే తక్కువ కాకుండా.. 20 సంవత్సరాలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుంది. ఈ కేసులో ఆరుగంటలకు పైగా కొనసాగిన విచారణ తర్వాత బెయిల్ మంజూరు చేయడానికి అవసరమైన విషయాలను సమర్పించడంలో విక్రమ్సింఘే న్యాయవాదులు విఫలమయ్యారు. దీంతో మెజిస్ట్రేట్ కోర్టు ఆయన బెయిల్ని నిలుపదల చేసి రిమాండ్ విధించింది.
విక్రమ్సింఘే 2022- 2024 మధ్యకాలంలో అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన భార్య మైత్రీ.. స్నాతకోత్సవానికి హాజరుకావడానికి ఇంగ్లాండ్ వెళ్లడానికి ప్రభుత్వ నిధులను వినియోగించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.