ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా
తిరువనంతపురం : ప్రపంచ ఫుట్బాల్ సూపర్స్టార్ లియోనల్ మెస్సీ ఈ ఏడాది కేరళ తీరాన్ని సాకర్ సంద్రంలో ముంచెత్తనున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్కు రానున్న మెస్సీ.. అంతకుముందే సహచర అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాళ్లతో కలిసి కేరళలో అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది అర్జెంటీనా మూడు ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఓ మ్యాచ్ యుఎస్ఏలో, మరో మ్యాచ్ ఆఫ్రికాలోని అంగోలాలో ఆడనున్న అర్జెంటీనా.. మూడో మ్యాచ్ను నవంబర్ 10-18న కేరళలో ఆడనుంది. కేరళ ప్రభుత్వ కమర్షియల్ భాగస్వామి రిపోర్టర్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఈ మ్యాచ్ కోసం రూ.400 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రూ.130 కోట్ల మేర అర్జెంటీనా ఫుట్బాల్ జట్టుకు చెల్లించింది. కేరళలో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్పై తొలుత అర్జెంటీనా విముఖంగా ఉండటంతో రిపోర్టర్ సంస్థ లీగల్ నోటీసులకు సిద్ధపడింది. దీంతో దిగొచ్చిన అర్జెంటీనా.. కేరళలో ఆడేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. తిరువనంతపురంలో జరిగే ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్లో అర్జెంటీనా ప్రత్యర్థిగా ఆడేందుకు మొరాకో, కోస్టారికా, ఆస్ట్రేలియా సహా జపాన్తో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దురహిమన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.