– జీఎస్టీి తగ్గింపు ఆశలు
న్యూఢిల్లీ : దీపావళి కల్లా జిఎస్టి రేట్లు తగ్గనున్నాయనే ఆశలతో వినియోగదారులు పలు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. జిఎస్టిలో భారీ సంస్కరణలను చేపట్టనున్నామని ఇటీవళ ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వస్తు సేవల పన్నుల్లో రెండు శ్లాబులను తెస్తామని చెప్పారు. దీనివల్ల రోజువారీ వస్తువులపై పన్ను తగ్గుతుందని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేయడంతో రిటైల్ వ్యాపారులు అమ్మకాల్లో క్షీణత చోటు చేసుకుంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ధరలు తగ్గుతాయనే ఆశతో వినియోగదారులు ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాల కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. దీనివల్ల చిన్న వ్యాపారులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు జిఎస్టి సంస్కరణలు తమకు ఊరటను కలిగిస్తాయని ఎంఎస్ఎంఇ వర్గాలు ఆశిస్తున్నాయి. జిఎస్టి తగ్గింపు ఆశతో కొనుగోళ్లు నిలిచిపోయాయని, అమ్మకాలు తగ్గాయని రిటైల్ వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. పన్ను రేట్లపై స్పష్టత లేకపోవడం రిటైల్ రంగంలో అనిశ్చితిని సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.