2022లో 1,379 ఎన్పీడీటీ కేసులు నమోదు
– 375 మందికి శిక్షలు ఖరారు
– మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధికం
– పోలీస్ శిక్షణ, కేసుల పర్యవేక్షణతో సాధ్యమైంది
– ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేసుల నమోదు, శిక్షలంటే ఒకప్పుడు పోలీస్ శాఖనే గుర్తుకొచ్చేది. కాని నేడు ఆ బాధ్యతను ఆబ్కారీ శాఖ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. 2021లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం తర్వాత కేసుల నమోదు, శిక్షల ఖరారు శాతం ఎక్సైజ్ శాఖలో భారీగా పెరిగింది. కొత్త చట్టానికి తోడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా, కల్తీ మద్యం తయారీ, అమ్మకాల కేసుల్లో శిక్షలు పడేలా చేయడంలో గణనీయమైన పురోగతి సాధించారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం తెలంగాణలో దశాబ్ద కాలంలో ఆబ్కారీ నేరాల్లో శిక్షల ఖరారు రెండింతలు పెరిగింది. ఎక్సైజ్ శాఖ కేసుల్లో కూడా నిందితులకు ఐదేండ్లు, పదేండ్ల శిక్షలు, లక్షలాది రూపాయల జరిమానాలు పడుతున్నాయి. కేసు నమోదు నుంచి మొదలుకుని పంచానామా, చార్జీషీట్, సాక్ష్యుల వాంగ్మూలాలు నమోదు చేయడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు శిక్షలు పడడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఎన్డీపీఎస్ కేసులు….
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎస్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2022లో దేశంలో ఎన్పీడీఎస్ చట్టం కింద పంజాబ్లో 12,442, ఏపీలో 1,391, తెలంగాణలో 1,279 కేసులు నమోదయ్యాయి. పంజాబ్లో 132, ఏపీలో 325, తెలంగాణలో 365 మందికి శిక్షలు పడ్డాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో శిక్ష ఖరారు దాదాపు 35 శాతంగా ఉంది. 2024లో 652 కేసుల్లో 997 మందిని అరెస్టు చేసి, 257 వాహనాలను సీజ్ చేశారు. 3,579 కిలోల గంజాయి, 446 గంజాయి మొక్కలను, 1.34 కేజీల హషీష్ అయిల్ను, 6.33 కేజీల ఓపీఎంను, 97 గ్రాముల ఎండిఎంఎను, 37 గ్రాముల ఎల్ఎస్డీ బ్లాస్ట్స్ను, 8.47 కేజీల ఆల్పోజోలంను పట్టుకున్నారు. 2025లో ఇప్పటి వరకు 880 కేసులు నమోదు చేసి 1,625 మందిని అరెస్టు చేసి 462 వాహనాలను సీజ్ చేశారు. 3,681 కిలోల గంజాయిని, 66.22 కేజీల గంజాయి చాక్లెట్లను, 43.66 గ్రాముల కోకైన్ను, 104.3 గ్రాముల హషీష్ అయిల్ను, 9.61 కేజీల ఆల్పోజోలంను పట్టుకున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎన్పీడీఎస్ చట్టం వచ్చిన తర్వాత సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అత్యధికంగా 36 కేసుల్లో శిక్షలు పడ్డాయి.
పోలీస్ శిక్షణ….
ఎక్సైజ్ శాఖ అంటే మద్యం అమ్మకాలు, కల్తీ అరికట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. కాని తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాలనాపరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆబ్కారీ శాఖను మరింత పటిష్టం చేసేందుకు వారికి పోలీస్ శిక్షణ అందించారు. పోలీస్ అకాడమీలో ఆబ్కారీ శాఖకు చెందిన 1,190 మంది అధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది వరకు శిక్షణ ఇచ్చారు. ఎన్పీడీఎస్ తర్ఫీదుతోపాటు చార్జీషీట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంచానామా రాసే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను పంచులగా చేర్చడం వంటి వాటిలో మెలకువలు నేర్పారు. ఫలితంగా గంజాయి, డ్రగ్స్, ఆల్పోజోలం లాంటి మత్తు పదార్ధాల కేసుల్లో శిక్షలు పడుతున్నాయని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.