నవతెలంగాణ-హైదరాబాద్: ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కేసులో సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి, అసత్యమైనవనీ జస్టిస్ పి.ఎన్. దేశారు నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిషన్ తేల్చి చెప్పింది. దీంతో సిద్ధరామయ్యకు కమిషన్ నివేదిక ఉపశమనం కలిగించింది.
కాగా, కర్ణాటకలోని ముడా భూముల వ్యవహారంలో.. సిద్ధరామయ్య, అతని కుటుంబ సభ్యులు 14 స్థలాలను అక్రమంగా కేటాంయింపులు జరిపినట్టు బిజెపి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసు విచారణలో సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, కనీసం చట్ట ఉల్లంఘన కూడా జరగలేదని పి.ఎన్ దేశారు కమిషన్ నివేదికలో పేర్కొంది. డీ-నోటిఫై అయిన భూములను ముడా తిరిగి వినియోగించుకున్నందుకు భూమి యజమానులకు పరిహారంగా స్థలాలు కేటాయించడమైందని, ఇది చట్ట ప్రకారమే జరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
తాజాగా ఈ విషయాన్ని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం విధాన సౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జస్టిస్ పీ.ఎన్. దేశారు నేతత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. మరోవైపు కొందరు ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020 నుంచి 2024 మధ్య పనిచేసిన కొంతమంది కమిషనర్లు నిబంధనలకు విరుద్ధంగా, తమకు ఇష్టమొచ్చినట్లు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారని పేర్కొంది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.