నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను కూడా తానే తగ్గించానని గతంలో ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ట్రంప్ తన పాత లెక్కను మార్చి, ఏడు నుంచి మూడుకు తగ్గించడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే, వైట్హౌస్లో టెక్ కంపెనీల సీఈవోలతో సమావేశమైన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, “మీకు తెలుసా? నేను ఇప్పటివరకు మూడు యుద్ధాలను ఆపాను” అని ట్రంప్ పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్న దేశాల మధ్య తాను శాంతిని నెలకొల్పానని, అది అసాధ్యమని చాలామంది చెప్పినా తాను చేసి చూపించానని అన్నారు. అయితే, ఆ మూడు యుద్ధాలు ఏవనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్లిష్టంగా మారినప్పటికీ, దాన్ని కూడా తాను కచ్చితంగా ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు.