– మళ్లీ జోరందుకున్న అక్రమ ఇసుక రవాణ దందా
– తోటపల్లి,బెజ్జంకి క్రాసింగ్ శివారుల్లో ఇసుక అక్రమ నిల్వలు
– రాత్రి సమయాల్లో మండలేతర ప్రాంతాలకు తరలింపు
“రాజా రాక్షసశ్చైవ
శార్దూలాః తత్ర మంత్రిణః
గృధ్రాశ్చ సేవకాస్సర్వే
యథా రాజా తథా ప్రజాః॥
రాజు మంచివాడైతే మంత్రులు,సేవకులు,ప్రజలు మంచిగా ఉంటారు. ఉండటానికి ప్రయత్నిస్తారు. రాజు నీతివర్తనతో, సత్యవాక్కుతో పాలిస్తే.. ప్రజలు కూడా నీతితో వ్యవహరిస్తారు.లేకపోతే అవినీతి అందలమెక్కుతుంది. ఆ రాజే రాక్షసుడైతే.. మంత్రులు పెద్దపులుల్లా, అధికారులు గద్దల్లా వ్యవహరిస్తారని భావం. అందుకనే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు.అందుకనే ‘యథా రాజా తథా ప్రజా’ అనే నుడికారం పుట్టింది. ఈ నుడికారానికి భిన్నంగా యథా మామూళ్లు తథా తరలింపు’ అనే కొత్త నానుడికి మండల అధికార యంత్రాంగ పనితీరు దర్పణం పడుతోంది. గత కొద్ది నెలలుగా ప్రధాన అధికార యంత్రాంగం కార్యాలయానికే పరిమితమై మద్యవర్తులకే సమయం కేటాయిస్తుండడంతో..మళ్లీ మండలంలో ఇసుక అక్రమ రవాణ జోరందుకుంది.
నవతెలంగాణ–బెజ్జంకి
మండల పరిధిలోని మోయతుమ్మెద వాగు అధికారులకు,ఇసుక మాఫీయదారులకు ప్రకృతి ప్రసాదించిన ఆదాయ వనరుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అధికార యంత్రాంగానికి, మాఫీయదారులకు కాసులు కురుపిస్తుంది. రేయింబవళ్లు మోయతుమ్మెద వాగు ఇసుక మండలేతర ప్రాంతాలకు అక్రమంగా తరలుతున్న అధికారులు అచేతన స్థితిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు మామూళ్ల ఆశ జూపుతూ..మాఫీయదారులు జోరుగా ఇసుక అక్రమ రవాణ సాగిస్తున్నారని తోటపల్లి, గాగీల్లపూర్ గ్రామాల్లో పలువురు ఖరాఖండిగా చెబుతున్నారు. అధికారులు అచేతన స్థితి వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ’ ఇండ్ల పథకం అబాసుపాలవ్వడంతో పాటు ఇసుక అక్రమ రవాణకు కేరాఫ్ గా నిలిచిందని ఇతర రాజకీయ నాయకులు వాపోతున్నారు.
మామూళ్లేనా..?
ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో అధికారులందరూ మామూళ్ల మత్తులో ఉన్నారని అనుకోవడానికి వీల్లేదు.అంకిత భావంతో పనిచేసే అధికారులు అన్ని శాఖల్లో ఉన్నారు. కనుకనే ప్రజలకు ప్రభుత్వాధికారులపై కొంతమేర నమ్మకముంది. ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే గగనమైన ఈరోజుల్లో ఏమి ఆశించకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులు తక్కవగా ఉన్నారనుకోవడంలో అతిశయోక్తి లేదు. మండలంలో కొందరు అధికారులు మామూళ్ల మత్తులో ఉండడం వల్ల అవినీతీ, అక్రమాలు రాజ్యమేలుతున్నాయనేది జగమేదిగిన సత్యమే. జిల్లాధికార యంత్రాంగం మండల అధికార యంత్రాంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తే అవినితీ, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురి విజ్ఞప్తి చేస్తున్నారు.
జోరుగా ఇసుక అక్రమ నిల్వలు..
మండల పరిధిలోని తోటపల్లి, గాగీల్లపూర్, బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారుల్లో మాఫీయదారులు జోరుగా ఇసుక అక్రమ నిల్వలు చేస్తున్నారు. పొద్దంత ఇసుక అక్రమ నిల్వలేర్పాటు చేసి రాత్రి సమయంలో మండలేతర ప్రాంతాలకు తరలిస్తున్నారని.. పోలీసులే ఇసుక అక్రమ రవాణకు సహాయకారులుగా వ్యవహరిస్తున్నారని అయా గ్రామాల పలువురు గ్రామస్తులు చెబుతున్నారు.
ఇసుక అక్రమ నిల్వల ప్రాంతాలు..
తోటపల్లిలో రామాలయం ఇసుక అక్రమ నిల్వలకు కేంద్రంగా మారింది.పోచమ్మ వీధీ, శివాలయం వెనుక వీధీ, చెన్నకేశవ ఆలయం వీధీతో పాటు ఇంటింటా ఇసుక అక్రమ నిల్వలున్నాయి. గాగీల్లాపూర్ గ్రామంలో ఇంటింటా ఇసుక అక్రమ నిల్వలేర్పాటు చేసి రాత్రి సమయంలో బోలేరో వాహనాల్లో జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్టు వినికిడి.
చట్టపరమైన చర్యలు చేపడుతున్నాం

మండలంలో ఇసుక అక్రమ నిల్వలపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నాం.ఇసుక అక్రమ నిల్వలను స్వాధీనం చెసుకుని పోలీస్ స్టేషన్ అవరణానికి తరలించాం.ఇసుక అక్రమ నిల్వలపై ఉపేక్షించం.
–సౌజన్య, ఎస్ఐ బెజ్జంకి.