గత పాలకులు రాష్ట్రం పై రూ.8.19 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు..
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నాం: మంత్రి పొంగులేటి
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా .. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
పార్టీలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ – వనపర్తి
గత పాలకులు 10 సంవత్సరాల్లో 8.19 లక్షల కోట్ల అప్పు భారం చేసి వెళ్లినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ ను నెరవేర్చుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తుది మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం పైన ఇన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని జోడేద్దుల వలె ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు.
ప్రజల దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం అసలు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, రూ. 21 వేల కోట్లతో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ, గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12 వేల చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వారి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల్లో పెళ్ళైన, పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు. గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని, కనీసం సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టిన ఐదు సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టేవారని కానీ వారికి పేదల సంక్షేమం కంటే కమిషన్లే ముఖ్యమని కాలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు.
ప్రజాపాలనలో తొలి విడతగా రూ. 22,500 కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు . ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఎవరిది ఏ స్థాయిలో ఉందో చూసి వెంటనే లబ్ధిదారుని ఖాతాలో డబ్బులు జమచేస్తున్నామని తెలియజేశారు. వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆదర్శ్ సురభి చాలా బాగా పనిచేస్తున్నారని అభినందించారు. బాగా పని చేసే అధికారులను అక్కున చేర్చుకుంటామని, దురుద్దేశ్యపూర్వకంగా పనిచేసే అధికారులను చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని రైతులకు భూ భారతి చట్టం ద్వారా తమ భూములకు భరోసా కల్పించామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత పాలకుల ముందు ప్రభుత్వాలు నడిపిన పాలకులు 70 వేల కోట్ల రుణాలు చేస్తే గత పాలకులు 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తిన పెట్టిపోయారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చి వందకు ఒకరిద్దరి మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారందరూ త్వరగా ఇళ్ళు కట్టుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక డైరీ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం స్వంత ఇల్లు లేదు అని బాధపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామనీ చెప్పారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఇందుకోసం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.00 లక్షల చొప్పున రూ. 22,500 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఇంటి మంజూరులో గత పాలకుల మాదిరి ముఖం చూసి బొట్టు పెట్టలేదని, పార్టీలకతీతంగా అర్హులైన వారికి పారదర్శకంగా ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణానికి డబ్బుల ఇబ్బందులు లేకుండా ప్రతి సోమవారం ఇంటి నిర్మాణం స్థాయి చూసి డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి స్వయంగా ఫోన్ చేసి మీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఆలస్యం అవుతుంది అని అడుగువున్నారని తెలిపారు.
స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజక వర్గంలో తూడి మేఘా రెడ్డిని గెలిపిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం నియోజక అభివృద్ధి కొరకు ఇప్పటికే రూ. 1000 కోట్లు ఒకసారి మరోసారి 280 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. అభివృద్ధి పరంగా రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం తర్వాత అంతటి ప్రాధాన్యత వనపర్తి నియోజకవర్గానికి కల్పించాలని మంత్రిని కోరారు. ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఇందిరమ్మ ఇల్లు అదనంగా మంజూరుచేయాలని మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 6,127 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటిలో 3565 ఇళ్లకు మార్క్ అవుట్ ఇవ్వగా నేటి వరకు 180 చెత్తు లెవెల్ పూర్తి అయ్యాయని, 150 ఇళ్లు రూఫ్ లెవెల్, 1220 బేస్మెంట్ లెవెల్ పూర్తి అయి మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు.
మంగంపల్లిలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం తరపున లబ్ధిదారులకు బట్టలు పెట్టగా స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి వ్యక్తిగతంగా లబ్ధిదారులకు బట్టలు పెట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ పి. శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

