– ప్రశాంతంగా గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడాగణేశ్
– జనసంద్రంగా మారిన ట్యాంక్ బండ్
– సందర్శకుల నినాదాలతో హౌరెత్తిన పరిసరాలు
– సాగర్ వద్ద సందర్శకులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి నినాదాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో గణేశ్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. జై బోలో గణేష్ మహారాజ్కీ జై అంటూ చిన్నాపెద్దా తేడా లేకుండా చేస్తున్న నృత్వాలు.. డ్యాన్స్ స్టెప్పులు, పీకల మోతలు, డప్పుచప్పుళ్లతో.. శంకర్కా భేటా.. ఘాడీమే బైటా.. అంటూ ప్రజల నినాదాలతో నగరంలో హౌరెత్తిపోయింది. జంటనగరాలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలతో ట్యాంక్బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం వేల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్తోపాటు పలు ప్రాంతాల్లో గణనాథులు గంగమ్మ ఒడికి చేరాయి. పలు రూపాల్లో కొలువైన గణనాథుని విగ్రహాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను చూడటానికి జనం భారీగా తరలిరావడంతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. నిమజ్జన ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీపీ సివి.ఆనంద్ హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. ట్యాంక్బండ్పై సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్ పేరుతో ఆలపించిన పాటలు హౌరెత్తించాయి. దాంతో సందర్శకులు, రాజకీయ నాయకులు సైతం నృత్యాలు చేశారు. ఆదివారం ఉదయం వరకూ నిమజ్జన ప్రక్రియ కొనసాగనుంది. అయితే, డీజేలకు అనుమతిలేదంటూ పోలీసులు చెప్పినా.. గుండెలు అదిరే మైక్ సౌండ్స్ ఆగలేదు.
ఆకస్మికంగా ట్యాంక్బండ్కు సీఎం
వినాయక నిమజ్జనం నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఆకస్మికంగా ట్యాంక్బండ్కు వచ్చి గణేష్ నిమజ్జనాలను పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా సీఎం ట్యాంక్బండ్కు చేరుకుని భద్రతా ఏర్పాటను పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని నేరుగా జనాన్ని అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ వ్యక్తిగా వచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే భద్రతా చర్యలను పటిష్టం చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. అత్యంత తక్కువ సంఖ్యలో భద్రత సిబ్బందితో మూడు కార్ల ఎస్కార్ట్తో సీఎం ట్యాంక్బండ్కు చేరుకున్నారు. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. విగ్రహాల నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరించాలని సూచించారు. ఉత్సవ సమితి వేదికపైకి ఎక్కి గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.
ప్రశాంతంగా ఖైరతాబాద్ విశ్వమహాగణపతి నిమజ్జనం
ఖైరతాబాద్ 69 అడుగుల మహాగణేశ్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన శోభాయాత్ర రాజ్ధూత్ హౌటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియేట్ మీదుగా 12 గంటలకు ట్యాంక్ బండ్కు చేరుకుంది. 1:30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగో నెంబర్ (బాహుబలి క్రేయిన్) క్రేయిన్ సహాయంతో నిమజ్జనం చేశారు. క్రేన్ నెం.12 వద్ద బాలాపూర్ గణపతిని నిమజ్జనం చేశారు. ఆదివారం ఉదయం వరకు నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES