- తర్వలో పాతనగరం రైట్ అఫ్ వే : హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ పాతనగరం కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవసరమైన రైట్ అఫ్ వే లభించే కీలక దశకు చేరుకున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్(హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 7.5 కిలోమీటర్ల ఈ కారిడార్లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు రోడ్డు విస్తరణ పనులు రైట్ ఆఫ్ వేకు సరిపడే దశకు వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విస్తరణ పనులు శరవేగంగా చేస్తున్నామని, వీలైనంత త్వరగా పాత నగరం ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైల్ పట్టాలెక్కించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు. మెట్రో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా అంచనా వేసినప్పటికీ, ఇంజినీరింగ్ పరిష్కారాలను అమలు చేయడం వల్ల వాటి సంఖ్య ఇప్పుడు 886కి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 550 పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తవుతున్నాయని, మిగతా ఆస్తులనూ విస్తరణకు అనువుగా కూల్చివేసే పనులు జరుగుతున్నట్టు చెప్పారు. బాధిత యజమానులకు ఇప్పటి వరకు రూ.433 కోట్ల నష్టపరిహారం చెల్లించామని అన్నారు. మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలిపారు. ప్రధానంగా అవసరమైన డీజీపీఎస్ సర్వే, భూగర్భంలో వివిధ యుటిలిటీలు, భూ సామర్థ్యం, మట్టి పరీక్షలు, అలైన్మెంట్ వెంబడి ఉన్న సున్నితమైన కట్టడాల పరిరక్షణ.. ఈ నాలుగు అంశాలపై ఇప్పుడు దృష్టి పెట్టామని, వీటన్నింటితో ప్రాజెక్టు నిర్మాణం సజావుగా జరిగేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మెట్రో పనులు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిరంతరాయంగా జరిగేందుకు ముందస్తు సాంకేతికపరమైన అన్ని చర్యలను చేపట్టామని, ఈ కీలక దశ దాటిన వెంటనే మెట్రో రైల్ నిర్మాణాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.