Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుమూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

- Advertisement -

నల్లగొండకు మాట ఇచ్చా.. నిలబెట్టుకుంటా
నెత్తిన నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు
శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు
కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి
హైదరాబాద్‌ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకే గోదావరి తాగునీటి సరఫరా పథకం
గోదావరి ఫేజ్‌-2,3 పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కాలుష్యంతో నిండిపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు విషతుల్యమైన నీటితో ఇబ్బందులు పడుతున్న నల్లగొండవాసులకు మాట ఇచ్చాననీ, కచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు. దానికోసమే మూసీ ప్రక్షాళన కోసమే మూసీ రివర్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఉస్మాన్‌సాగర్‌ వద్ద రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టనున్న గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేస్‌ -2, 3 పనులకు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ నగరానికి వందేండ్లకు పైగా తాగునీరు అందుతున్నదంటే ఆనాటి నిజాం సర్కార్‌ దూరదృష్టే కారణమని అన్నారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్‌ ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. 1965లో మంజీరా నది నుంచి, 2002లో కృష్ణా నది జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి, ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాలదేనని చెప్పారు. కాంగ్రెస్‌ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని, తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని పరోక్షంగా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపారు. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్లు చేసిన పాపాలు పోవని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందన్నారు. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించబోతున్నామనీ, ఇందులో 16 టీఎంసీలు హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాల కోసం, 4 టీఎంసీలతో చెరువులను నింపుకుంటూ మూసీకి తరలించి, మూసీని ప్రక్షాళన చేస్తామని వివరించారు. పదేండ్లు అధికారంలో ఉన్నవాళ్లు మూసీనది ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నామనీ, ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్‌ అని మాట్లాడుతున్నరని అన్నారు. తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామనీ, దీనికి అందరూ కలిసి రావాలని కోరారు. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను డిసెంబర్‌ 9న తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని ప్రకటించారు. ‘మూసీ నది మురికి కూపంగా ఉండాలి… గంగా, యమునా, సబర్మతీ నదులు మాత్రమే ప్రక్షాళన కావాలా?’ అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రాజెక్టు విషయంలో ముందుకేవెళ్తామన్నారు. కొందరు తాటిచెట్టులా ఎదిగినా బుద్ధి మాత్రం రాలేదని విమర్శించారు.

రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జంటనగరవాసులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. భవిష్యత్‌ తరాల అవసరాలకు అనుగుణంగా రాబోయే రెండేండ్లలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తూ, వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కోకాపేట వద్ద నియో పోలీసు ట్రంపెట్‌ ఇంటర్‌ చేంజ్‌ ప్రారంభం
హైదరాబాద్‌ మెట్రో పాలిటెన్‌ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సౌజన్యంతో కోకాపేట వద్ద ఏర్పాటుచేసిన నియో పోలీసు ట్రంపెట్‌ ఇంటర్‌ చేంజ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యమ్రంలో మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌, శాసనమండలి చీఫ్‌ వీప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad