- రాష్ట్ర గ్రంథాలయ చైర్మెన్ డాక్టర్ రియాజ్
- పుస్తకం కోసం నడక..
నవతెలంగాణ-ముషీరాబాద్
మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గం వేద్దామని రాష్ట్ర గ్రంథాలయ చైర్మెన్ డాక్టర్ రియాజ్ అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు ”పుస్తకాలతో నడక-వాక్ విత్ బుక్స్” అనే కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, ప్రజల్లో అక్షరాస్యత పెంపు, పుస్తకాలు చదివే అలవాటును పెంచడం కోసం ఈ కార్యక్రమంలో పుస్తక ప్రియులు, రచయితలు, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ.. ఒంటరిగా ఉన్న మనిషికి అక్షరం ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని, ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న మనిషి నూతన నాగరికత దిశకు నడిపిస్తాడని తెలిపారు. ఆ క్రమంలోనే అక్షరాస్యతను, పుస్తకాలు బాగా చదివే అలవాటును పెంచాలని కోరారు. గ్రంథాలయ ఉద్యమం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయ అభివద్ధికి, పుస్తకాలను చదువరులకు మరింత చేరువ చేయడం కోసం గ్రంథాలయ సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టబోతుందని వివరించారు సెల్ఫోన్ల కన్నా పుస్తకాలతో ఎక్కువ గడపాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు చదువు పట్ల నిబద్ధత నేర్పించి.. రోజువారీగా గ్రంథాలయానికి గంట సమయం కేటాయించాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రంథాలయల అభివృద్ధి యువతను చెడు అలవాట్ల నుంచి దూరం చేస్తుందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువత మరింత విస్తారంగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. మరో గ్రంథాలయ ఉద్యమానికి ప్రభాకర్, విజయలక్ష్మి రవికుమార్ నాయకత్వం వహించారు. భవిష్యత్లో ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు నర్సింగరావు, ప్రముఖ రచయిత వేణుగోపాల్, కవి రచయిత యాకూబ్,భూపతి వెంకటేశ్వర్లు, చిత్రం శ్రీధర్, వాసు, గ్రంథాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.