- తుమ్మిడిహట్టి బ్యారేజీకి ప్రణాళికలు
- సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు
- టీఏసీ క్లియరెన్స్కు సిఫారసు
- పాలమూరు-రంగారెడ్డి పూర్తికి ప్రాధాన్యత
- హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకున్న దరిమిలా రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. సోమవారం రోజున నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షలో ఆయన పాల్గొని రాష్ట్రం లోని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్జీవన్పాటిల్, సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, సీ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు పెట్టిన చేవెళ్ల-ప్రాణహితను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో సమ్మక్క- సారక్క ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర జలవనరుల సంఘం సమావేశానికి హాజరై ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులతో పాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విదంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చించి అనుమతులు తీసుకోవాలని ఆయన సూచించారు. సీతారాం సాగర్, మోడికుంట వాగు,చనాకా-కొరాట డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థతోపాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాలకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలన్నారు. కష్ణా జలాల వివిధ ట్రిబ్యునల్ విషయమై సుప్రీంకోర్టులో ఈ నెల 23-25న వాదనలు ఉన్నాయనీ, అంతకు ముందే సుప్రీంకోర్టు న్యాయవాది సి.ఎస్.వైద్యనాధ్తో చర్చలు జరగనున్నాయన్నారు.
జాతీయ డ్యామ్ల పరిరక్షణ సంస్థ(ఎన్డీఎస్ఏ) చేసిన సూచనలకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పునరుద్ధరణ ఉంటుందన్నారు. బ్యారేజీలను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందన్నారు. కాగా ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా పనులు ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో ఐఐఐటీ వంటి సంస్థలతో నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరీక్షించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వరదలు తగ్గిన వెంటనే పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది వానాకాలం లోపు పనులు పూర్తి చేయాలన్నారు. అన్నింటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాసంతో పాటు అటవిశాఖా అనుమతుల వంటి ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అలాగే డిండీ, ఎస్ఎల్బీసీ, పెండ్లిపాకల, నక్కలగండి ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దష్ట్యా ప్రత్యామ్నాయంగా మరో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అక్కడి ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి ముందే దేవాదుల ప్యాకేజ్3, 6 పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం జూరాల, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ నిజాంసాగర్, హుస్సేన్సాగర్ తదితర ప్రాజెక్టులలో పూడిక తీత పనులు ప్రారంభించ బోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు చేపట్టిన పూడిక తీత పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 500 కోట్ల రాబడి ఉంటుందనీ, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్టయితే ప్రభుత్వానికి రూ. 3000 కోట్ల నుంచి రూ. 4000 కోట్ల వరకు రాబడి వస్తుందన్నారు. అన్నింటికీ మించి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఎస్ఎల్బీసీ పనుల పునరుద్దరణకు గాను నిర్వహించతలబెట్టిన హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయాన్నారు. టన్నెల్ సమీపంలో హెలిబోర్న్ ఏరియల్ మాగెటిక్ సర్వే ఏర్పాట్లను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.